ఇయాల (జూన్ 22 న) జిల్లాకు ఇన్ చార్జి మంత్రి తుమ్మల

ఇయాల (జూన్ 22 న) జిల్లాకు ఇన్ చార్జి మంత్రి తుమ్మల
  • మంత్రులు పొన్నం, దుద్దిళ్ల, అడ్లూరి కూడా.. 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఇటీవల నియమితులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం కరీంనగర్ కు రాబోతున్నారు. ఇన్ చార్జి మంత్రిగా నియమితులయ్యాక తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.  ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రజాపాలన పథకాలపై సమీక్షించనున్నారు. 

శాతవాహన ఫార్మసీ కాలేజీలో అకడమిక్ బ్లాక్ కు శంకుస్థాపన.. 

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎండీ సమీపంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో ఆదివారం ఉదయం10 గంటలకు నిర్వహించే అకడమిక్ బ్లాక్, కాలేజీ ప్రహరీ గోడ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరుకాబోతున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్ తెలిపారు. పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో తరగతి గదులు, అంతర్గత నిధులు రూ.2.85 కోట్లతో ప్రహరీ నిర్మాణం చేపట్టారు.