హైదరాబాద్,వెలుగు: లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్పైనా పోలీసులు ఎమర్జెన్సీ సర్వీస్ అందిస్తున్నారు. కర్ఫ్యూ టైమ్లో సిటిజన్ల నుంచి వస్తున్న డయల్ 100 కాల్స్, ట్విట్టర్ పోస్టింగ్స్కి రెస్పాండ్ అవుతున్నారు. నిత్యావసరాల నుంచి మెడిసిన్ వరకూ సప్లయ్చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి వెహికల్స్ కి పర్మిషన్ ఇస్తున్నారు. జనతా కర్ఫ్యూకి ముందు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు లాక్ డౌన్ తో అక్కడే ఉండిపోయారు. ఇక్కడున్న వారి ఫ్యామిలీ మెంబర్స్, వృద్ధుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. అలాంటివారు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ వాళ్లకు సాయం చేయాలని ఎక్కువమంది ట్విట్టర్లో రిక్వెస్ట్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు స్థానిక సిబ్బందికి సమాచారం ఇచ్చి పనులు చేసిపెడుతున్నారు.
ఇంటికి వెళ్లి మెడిసిన్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసర మండలం రాంపల్లిలో ఉండే చిట్టి రత్నం(60) డయాబెటిస్ పేషంట్. ఆమె కొడుకు మరొక రాష్ట్రంలో ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నాడు. ఇంట్లో తల్లి ఒక్కతే ఉంటారు. లాక్ డౌన్ తో ఎక్కడి వారక్కడే ఉండిపోవడంతో ఆమెకు మెడిసిన్ తెచ్చిచ్చే వారు కరువయ్యారు. కూకట్పల్లిలో ఉండే ఆమె అల్లుడు భరత్ కుమార్ రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. తన అత్తగారికి ట్యాబ్లెట్స్ అందించాలని రాచకొండ పోలీసులను ట్విట్టర్లో కోరుతూ
ఆమె అడ్రస్, మెడిసిన్ డీటెయిల్స్ పోస్ట్ చేశాడు. కీసర ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ స్పందించి కానిస్టేబుల్స్తో మందులు పంపించారు. పోలీసులకు భరత్, చిట్టి రత్నం థాంక్స్ చెప్పారు.
వేరే ఊరికి వెళ్లాలంటూ…
వనపర్తిలో తమ రిలేటివ్ చనిపోయారని, అక్కడికి తన పేరెంట్స్ వెళ్లాలని రాజేంద్రనగర్ లో ఉండే ఓ సిటిజన్ ట్విట్టర్లో డీజీపీ, తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. పోలీసులు స్పందించి లొకేషన్ షేర్ చేయాలని 9490616555 ఇచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన సిబ్బంది స్థానిక పోలీసుల నంబర్ ఫార్వర్డ్ చేసి, వారిని కలవాలని సూచించారు.
గ్రాండ్ మదర్కి సీరియస్గా ఉందని…
ఏపీకి చెందిన యువతి విజయవాడలో ఉన్న తన గ్రాండ్ మదర్కి సీరియస్ గా ఉందని మినిస్టర్ కేటీఆర్తోపాటు డీజీపీకి ట్వీట్ చేసింది. అక్కడికి వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది. రెస్పాండ్ అయిన పోలీసులు ఆమె లోకేషన్ తెలుసుకుని, సంబంధిత పీఎస్ కి ఆధారాలతో వెళ్లాలని సూచించారు.
తాతయ్య చనిపోయాడని..
భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఉన్న తన తాతయ్య చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ట్వీట్ చేశాడు. తాను రాజేంద్రనగర్ లో చిక్కుకున్నానని తన కార్నంబర్ పోస్ట్ చేశాడు. పోలీసులు స్పందించిన స్థానిక పీఎస్ కి వెళ్లాలని సూచించారు. కాగా, చాలావరకు ఫేక్ మెసేజ్లు కూడా ఉంటున్నాయని, కన్ఫర్మ్ చేసుకున్నాకే హెల్ప్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.