- మణికొండ మున్సిపల్
- పరిధిలోని పుప్పాలగూడ ఘటన
గండిపేట్,వెలుగు: రెడిమిక్స్ ప్లాంట్ మిక్సర్లో పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన నార్సింగి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ మున్సిపల్ పరిధి పుప్పాలగూడలోని అశోక బిల్డర్స్ కన్స్ట్రక్షన్స్ సైట్ లో సంస్థ భారీ నిర్మాణాన్ని చేపడుతుంది. జార్ఖండ్ కు చెందిన మరంగా బేటా సోరేన్(30), సుసిల్ మర్మూ (29)లు కార్మికులుగా పని చేస్తున్నారు. శనివారం రెడిమిక్స్ మిక్సర్ క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా మిషన్ ఆన్ చేయగా.. వారు అందులో పడి నుజ్జునుజ్జు అయి మృతిచెందారు.
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు బలయ్యారని తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆఫీసులోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. న్యాయం చేయాలని బైఠాయించారు. పోలీసులు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.