పెరుగుతున్న సైబర్​ ఫ్రాడ్స్.. రెచ్చిపోతున్న ఆన్​లైన్​ నేరగాళ్లు

పెరుగుతున్న సైబర్​ ఫ్రాడ్స్.. రెచ్చిపోతున్న ఆన్​లైన్​ నేరగాళ్లు
  • లక్షలు పోగొట్టుకుంటున్న అమాయకులు 
  • అవేర్​నెస్​ కల్పిస్తున్నా ఆగని మోసాలు

మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి.  ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపి అకౌంట్​ల నుంచి లక్షలు మాయం చేస్తున్నారు. వాట్సప్​, ఫేస్ బుక్, ఇన్​స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్ లను ఆసరా చేసుకుని అమాయకులను సైబర్​ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈజీ మనీ మీద ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని టెక్నాలజీ సహాయంతో    పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేస్తున్నారు. లోన్ యాప్, ఎస్ఎంఎస్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, బిట్ కాయిన్ , క్రిప్టో కరెన్సీ, పార్ట్ టైమ్ జాబ్  పేరుతో సామాన్యులను మోసగిస్తున్నారు. సైబర్  మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అవేర్ నెస్​ ప్రోగ్రామ్స్​ కండక్ట్​ చేస్తున్నప్పటికి సైబర్ మోసాలకు బ్రేక్​ పడటం లేదు. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్న ఉదంతాలు ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో...

జిల్లాలోని సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట ప్రాంతాల్లో ఎక్కువగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి.  పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ లో రెండు రోజుల వ్యవధిలో సైబర్​ నేరగాళ్లు సుమారు రూ.57 లక్షలు కాజేశారు.  మూడు రోజుల క్రితం అమీన్ పూర్ లో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగులకు రెట్టింపు డబ్బు ఆశ చూపిన కేటుగాళ్ళు బురిడీ కొట్టించారు. అధిక డబ్బుకు ఆశపడి ఓ మహిళా రూ.21 లక్షలు, మరో మహిళ రూ.4.6 లక్షలు పోగొట్టుకున్నారు. అలాగే మంగళవారం  మరో ఇద్దరు వ్యక్తులను టాస్క్ ల పేరుతో బురిడీ కొట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.1.60 లక్షలు కాజేశారు. బాధితులు1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా, వా వివరాలను పోలీసులు సీక్రెట్​గా ఉంచి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నెలరోజుల క్రితం సంగారెడ్డిలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరాగాళ్లు ఓ లింక్ పంపితే దాన్ని అతను ఓపెన్ చేసి చూసేసరికి ఐదు నిమిషాల్లో అతని అకౌంట్ లో నుంచి రూ.11 మాయమయ్యాయి. నారాయణఖేడ్ లో 15 రోజుల క్రితం ఓ ప్రైవేట్​ ఎంప్లాయ్​ తనకు వచ్చిన ఫేక్ ఐడీని ఓపెన్ చేసి చూడగా దశలవారీగా రూ.19 లక్షలు  పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లాలో  సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే మొదటి వారం వరకు రూ.40.99 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.  జిల్లాలో  గత 15 నెలల కాలంలో దాదాపు 270 సైబర్  కేసులు నమోదయ్యాయి. కాగా వాటిలో 150 కేసుల్లో పెద్ద మొత్తంలో డబ్బులను ఫ్రీజ్ చేసి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి సైబర్ నేరగాడు  ఫోన్ చేశాడు.  మీకు రూ.3 లక్షల రూపాయల లోన్ శాంక్షన్​ అయింది.  ప్రాసెస్ చార్జీ, జీఎస్టీ, ఇన్సూరెన్స్, సిబిల్ స్కోర్ ల కోసం ఖర్చులు ఉంటాయని చెప్పగానే  నమ్మిన బాధితుడు రూ.45,570 పంపించాడు.  తరువాత సైబర్ మోసగాడు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి కంప్లైంట్  చేశాడు. దీంతో సైబర్ నేరగాడికి చేరిన అకౌంట్లో ఉన్న  రూ.45,570లు  ఫ్రీజ్ చేశారు.

మెదక్ జిల్లాలో...

జిల్లాలో తరచూ సైబర్​ నేరాలు వెలుగు చూస్తున్నాయి.  గతేడాది 27 సైబర్ కేసులు బుక్​ అయ్యాయి. గత ఫిబ్రవరి 2వ తేదీన మనోహరాబాద్ మండల కేంద్రంలో నివసిస్తున్న కృష్ణ జిల్లాకు చెందిన యావ శ్రీనివాస్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​చేసి మాయమాటలు చెప్పి ఓ లింక్​ పంపారు. అతను లింక్ ఓపెన్ చేయగా అతని బ్యాంక్​ అకౌంట్ నుంచి రూ.1.75 లక్షలు పోయాయి. గత ఫిబ్రవరి 22 వ తేదీన మనోహరాబాద్​ మండలం పోతారం గ్రామానికి చెందిన చెలిమ చంద్రశేఖర్​ఫోన్​కు టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్​ చేస్తే డబ్బులు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు కాల్​ చేసి చెప్పారు. అతను ఆ లింక్​ ఓపెన్​ చేయగా అతని బ్యాంక్​ అకౌంట్ లో నుంచి రూ.1.42 లక్షలు పోయాయి. గత ఏప్రిల్​ నెలలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె, కౌడిపల్లికి గ్రామానికి  చెందిన ఇద్దరు  సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.1.05 లక్షలు పోగొట్టుకున్నారు. వెల్మకన్నకు చెందిన బ్యాంక్ మిత్ర విఠల్ రూ.75 వేలు, కౌడిపల్లికి చెందిన మరో బ్యాంక్ మిత్ర శ్రీనివాస్ గౌడ్ రూ.30 వేలు  ట్రాన్స్ ఫర్ చేశారు. తర్వాత  తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయామని గుర్తించారు.