న్యూఢిల్లీ: జనం షాపింగ్ అలవాట్లను, ఖర్చు పెట్టే విధానాన్ని కరోనా మార్చేసింది. ఇది వరకటిలా దుస్తులకు, బ్యూటీ ప్రొడక్టులకు, లిక్కర్కు ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేయడం తగ్గింది. హెల్త్, వెల్నెస్ ప్రొడక్టులను కొనడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగింది. ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ డేటా ఎనలిటిక్స్ గ్రూప్ ‘యూగవ్’ ఇటీవల చేసిన స్టడీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకోసం మూడు వేల మంది రెస్పాండెంట్ల నుంచి వివరాలు తీసుకుంది. ఈ రిపోర్టు ప్రకారం..తాము ఇది వరకంటే ఎక్కువ హెల్త్, వెల్నెస్ ప్రొడక్టులను ఆఫ్లైన్లో కొంటున్నామని 60 శాతం మంది చెప్పారు. మెడిసిన్స్, శానిటైజర్స్ వంటి వెల్నెస్ ప్రొడక్టులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ప్రొడక్టులను ఆన్లైన్లోనూ ఆర్డర్ చేస్తున్నామని 50 శాతం మంది పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది గత రెండు వారాల్లో గ్రాసరీ ఐటెమ్స్ కొన్నారు. 20 శాతం మంది సినిమాలకు, గేమింగ్కు కూడా ఖర్చు చేశారు. దుస్తులు, బ్యూటీ, లిక్కర్ కోసం ఖర్చు పెట్టిన రెస్పాండెంట్ల సంఖ్య వరుసగా 11 శాతం, 8 శాతం, 7 శాతం ఉంది.
వచ్చే నెలలో అమ్మకాలు పెరిగే చాన్స్
దేశమంతటా కరోనా లాక్డౌన్ రిస్ట్రిక్షన్లు ఎత్తివేస్తున్నందున ఈ సర్వే చేశామని యూగవ్ ప్రకటించింది. టీవీలు, ఫోన్ల వంటి సాధారణ వస్తువుల అమ్మకాలు కూడా మార్చి క్వార్టర్లో పుంజుకున్నాయి. ఏప్రిల్ నుంచి లాక్డౌన్లు మొదలుకావడంతో రిటైలర్లు తీవ్రంగా నష్టపోయారు. గిరాకీలు అమాంతం పడిపోయాయి. అయితే, మే నెలలో కూడా హెల్త్, వెల్నెస్ ప్రొడక్టులకు గిరాకీ పడిపోలేదని రిటైలర్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ తెలిపింది. ‘‘కస్టమర్లు ఇమ్యూనిటీ బూస్టర్లను తెగ కొంటున్నారు. చ్యవన్ప్రాశ్, ప్రొటీన్ ఎక్స్, పీడియాషూర్ వంటివి బాగా అమ్ముడవుతున్నాయి. హాట్ బేవరేజెస్ సేల్స్ ఏప్రిల్తో పోలిస్తే మేలో రెండు శాతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సెగ్మెంట్ 12 శాతం పెరిగింది’’ అని వివరించింది. ఇదేకాలంలో ఓట్స్ సేల్స్ 31 శాతం, సూప్స్ సేల్స్ నాలుగుశాతం పెరిగాయి. బ్యూటీ, కాస్మొటిక్స్ సేల్స్ పడిపోయాయి. సబ్బులకు, షాంపూలకు గిరాకీ ఎప్పట్లాగే ఉంది. అయితే రాబోయే వారాల్లో బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియెన్సెస్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని రిటైలర్లు చెబుతున్నారు. ‘‘గత ఏడాది, ఈ సంవత్సరం లాక్డౌన్లు, రిస్ట్రిక్షన్ల వల్ల ఎకానమీ దెబ్బతిన్నది. సెకండ్వేవ్ వల్ల జనం శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో కష్టాలు వచ్చాయి. తప్పనిసరిగా కొనాల్సినవి మాత్రమే తీసుకుంటున్నారు. మందులకు ఎక్కువ ఖర్చవుతోంది. మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే భయంతో పొదుపును పెంచారు’’ అని ఉషా ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ డివిజన్ ప్రెసిడెంట్ రోహిత్ మథుర్ అన్నారు. ప్రస్తుతం సేల్స్ మందకొడిగా ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
కిరాణాల్లోనే కొంటున్నాం...
అయితే కిరాణా వస్తువులను లోకల్ షాపుల్లోనే కొంటున్నామని 58 శాతం మంది రెస్పాండెంట్లు, ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా ఆర్డర్ ఇచ్చామని 42 శాతం మంది అన్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం సేఫ్, సౌకర్యవంతం కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిని ఎంచుకున్నామని తెలిపారు. ఆన్లైన్లో ప్రొడక్టుల క్వాలిటీపై నమ్మకం లేకే కిరాణాల్లో కొన్నామని 30 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. లోకల్ షాపులు కూడా హోం డెలివరీ చేస్తున్నాయని తెలిపారు. ‘‘ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్ షాపింగ్ కంపెనీలకు భవిష్యత్లో అవకాశాలు పెరుగుతాయి. ‘బయ్ నౌ పే లేటర్’ ఆప్షన్ వల్ల చాలా మంది ఆన్లైన్కు మారవచ్చు. కరోనా భయంతో ఎక్కువ మంది షాపులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అందుకే ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతాయి’’ అని ఈ రిపోర్టు వివరించింది.