బెంగళూరు: టీమిండియా డ్యాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (113 బాల్స్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 90) మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. సౌతాఫ్రికా–ఎ బౌలర్లపై విరుచుకుపడటంతో.. ఆదివారం ముగిసిన అనధికార తొలి టెస్ట్లో ఇండియా–ఎ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో 1–0 లీడ్లో నిలిచింది. 275 రన్స్ టార్గెట్ ఛేదనలో 119/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు బరిలోకి దిగిన ఇండియా–ఎ రెండో ఇన్నింగ్స్లో 73.1 ఓవర్లలో 277/7 స్కోరు చేసి నెగ్గింది. ఆఖరి రోజు విజయానికి 166 రన్స్ అవసరం కాగా పంత్, ఆయుష్ బదోనీ (34) అటాకింగ్కు దిగారు.
దాంతో 12 ఓవర్లలోనే 53 రన్స్ జత చేశారు. చివరకు టియాన్ వాన్ వురెన్ (3/56) బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి పంత్ వెనుదిరిగాడు. తనుష్ కొటియాన్ (23) ఉన్నంతసేపు మెరుగ్గా ఆడాడు. కానీ వరుస విరామాల్లో ఈ ఇద్దరూ వెనుదిరగడంతో ఇండియా 215/7తో ఎదురీత మొదలుపెట్టింది.
ఈ దశలో మానవ్ సుతార్ (20 నాటౌట్), అన్షుల్ కాంబోజ్ (37 నాటౌట్) ఎనిమిదో వికెట్కు 62 రన్స్ జత చేసి ఇండియాను గెలిపించారు. షిపో మోరెకి 2 వికెట్లు తీశాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీసిన తనుష్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ గురువారం నుంచి జరుగుతుంది.
