
- 225/2తో రెండో రోజు ఇంగ్లండ్ జోరు
- తొలి ఇన్నింగ్స్లో ఇండియా 358 ఆలౌట్
- దెబ్బకొట్టిన స్టోక్స్, ఆర్చర్
- ఆదుకున్న పంత్, శార్దూల్
మాంచెస్టర్: రియల్ ఫైటర్ రిషబ్ పంత్ (54) విరిగిన కాలుతోనే బ్యాటింగ్ చేసి విలువైన రన్స్ చేసినా.. మిగతా బ్యాటర్లకు తోడు బౌలర్లు కూడా నిరాశపరచడంతో ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో ఇండియా వెనుకంజ వేసింది. పోటాపోటీ ఆటలో తొలి రోజు కాస్త పైచేయి సాధించినా.. రెండో రోజు తేలిపోయింది.
ఇంకోవైపు ఇంగ్లిష్ టీమ్ బజ్బాల్ ఆటతో గిల్సేనపై ఆధిపత్యం చూపింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (5/72) సూపర్ బౌలింగ్తో టీమిండియాను అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆతిథ్య జట్టు గురువారం చివరకు తొలి ఇన్నింగ్స్లో46 ఓవర్లలో 225/2 స్కోరు చేసింది.
ఓపెనర్లు బెన్ డకెట్ (100 బాల్స్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బాల్స్లో 13 ఫోర్లు, 1 సిక్స్తో 84) తొలి వికెట్కు 195 బాల్స్లోనే 166 రన్స్ జోడించి మెరుపు ఆరంభం ఇచ్చారు. ప్రస్తుతం ఒలీ పోప్ (20 బ్యాటింగ్), జో రూట్ (11 నాటౌట్) క్రీజులో ఉండగా ఇండియా స్కోరుకు ఆ టీమ్ 133 రన్స్ దూరంలో ఉంది.
హోమ్ టీమ్ ఇదే జోరును మూడు రోజు కూడా కొనసాగిస్తే మ్యాచ్తో పాటు సిరీస్ ఇండియా చేజారినట్టే. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 264/4కు మరో వంద రన్స్ కూడా జోడించకుండానే గిల్సేన మిగతా ఆరు వికెట్లు కోల్పోయి 358 వద్ద ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (41) ఫర్వాలేదనిపించినా.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (20), వాషింగ్టన్ సుందర్ (27) ఆకట్టుకోలేకపోయారు. స్టోక్స్ ఐదు, జోఫ్రా ఆర్చర్ (3/73) మూడు వికెట్లు పడగొట్టాడు.
పంత్, శార్దూల్ పోరాటం.. స్టోక్స్ దెబ్బ
రెండో రోజు ఆట ఆరంభంలోనే ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చల్లటి వాతావరణంలో వస్తున్న సీమ్, స్వింగ్ను సద్వినియోగం చేసుకున్న ఆర్చర్, స్టోక్స్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. ఆట మొదలైన రెండో ఓవర్లోనే కీలకమైన జడేజాను ఆర్చర్ వెనక్కుపంపాడు. ఈ దశలో శార్దూల్.. వోక్స్, స్టోక్స్ ఓవర్లలో వెంటవెంటనే రెండు ఫోర్లు కొట్టాడు.
స్పిన్ ఆల్రౌండర్ సుందర్ తో కలిసి ఒక్కో పరుగు జోడిస్తూ.. స్కోరు 300 దాటించాడు. కానీ, ఫిఫ్టీకి చేరువైన అతను స్టోక్స్ ఊరించే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను వెంటాడి గల్లీలో డకెట్కు క్యాచ్ ఇవ్వడంతో ఆరో వికెట్కు 48 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది.
ఈ టైమ్లో స్టేడియంలోని ప్రేక్షకులంతా నిల్చొని చప్పట్లు కొడుతుండగా.. పంత్ క్రీజులోకి వచ్చాడు. గాయం కారణంగా ఎక్కువ స్ట్రయిక్ రొటేట్ చేయలేకపోయాడు. వర్షంతో కాస్త ముందుగానే లంచ్ ప్రకటించగా.. 321/6తో రెండో సెషన్ మొదలైన వెంటనే స్టోక్స్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకున్న సుందర్తో పాటు అరంగేట్రం కుర్రాడు అన్షుల్ కంబోజ్ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో ఇండియా 337/8తో నిలిచింది.
మరో రెండు వికెట్లే ఉండటంతో పంత్ బ్యాట్కు పని చెప్పాడు ఆర్చర్ బౌలింగ్లో పుల్ షాట్తో సిక్స్ కొట్టిన అతను స్టోక్స్ బౌలింగ్లో ఫోర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే ఆర్చర్ వేసిన అద్భుత బాల్ను కొంచెం లేట్గా డిఫెండ్ చేయబోయి బౌల్డ్ అవ్వడంతో అతని పోరాటానికి తెర పడింది. బుమ్రా (4), సిరాజ్ (5 నాటౌట్) చెరో ఫోర్ కొట్టి స్కోరు 350 దాటించారు. ఆర్చర్ బౌలింగ్లో బుమ్రా కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
వన్డే స్టయిల్ ఓపెనింగ్
ఇండియా బ్యాటర్లు తడబడిన వికెట్పై ఇంగ్లండ్ ఓపెనర్లు డకెట్, క్రాలీ అదరగొట్టారు. రెండో సెషన్లో బ్యాటింగ్కు వచ్చిన జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. కొత్త పేసర్ అన్షుల్ వేసిన రెండో ఓవర్లోనే మూడు ఫోర్లతో జోరు చూపెట్టిన డకెట్.. బుమ్రా బౌలింగ్లో రెండు ఫోర్లతో మరింత స్పీడు పెంచాడు.
సిరాజ్ వేసిన పదో ఓవర్లో రెండు బౌండ్రీలతో క్రాలీ కూడా బ్యాట్కు పని చెప్పడంతో 61 బాల్స్లోనే ఇంగ్లండ్ స్కోరు 50 దాటింది. సిరాజ్ను టార్గెట్ చేసి క్రాలీ మరిన్ని షాట్లు ఆడగా..ఆ జట్టు 77/0తో టీ బ్రేక్కు వెళ్లింది. మూడో సెషన్లోనూ ఓపెనర్లు అదే ఊపును కొనసాగిస్తూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు.
కెప్టెన్ గిల్.. బౌలర్లను, ఫీల్డింగ్ను మారుస్తున్నా ఫలితం లేకపోయింది. బుమ్రా ప్లేస్లో బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ జడేజాకు క్రాలీ 6,4తో వెల్కం చెప్పాడు. వీళ్ల జోరుకు చూస్తుండగానే స్కోరు 150 దాటింది. చివరకు జడ్డూ బౌలింగ్లో స్లిప్లో కేఎల్ రాహుల్ పట్టిన చురుకైన క్యాచ్కు క్రాలీ ఔటవడంతో ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్ లభించింది.
అయినా వెనక్కు తగ్గని డకెట్.. వెంటవెంటనే మరో మూడు ఫోర్లు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. అయితే, అన్షుల్ షార్ట్ వైడ్ బాల్కు కట్ షాట్ ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రూట్ జతగా స్కోరు 200 దాటించిన ఒలీ పోప్ మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
- ఇండియా తొలి ఇన్నింగ్స్: 114.1 ఓవర్లలో 358 ఆలౌట్(సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72, ఆర్చర్ 3/73).
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 46 ఓవర్లలో 225/2 (డకెట్ 94, క్రాలీ 84, జడేజా 1/37).
ఫైటర్ పంత్
ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో అద్భుతం చేశాడు. ఓ పోరాట యోధుడిని తలపిస్తూ విరిగిన కాలుతో బ్యాటింగ్కు దిగి ఔరా అనిపించాడు. తొలి రోజు 37 రన్స్ వద్ద క్రిస్ వోక్స్ పదునైన యార్కర్ తగిలి కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది.
బొటనవేలి నుంచి మడమ వరకు ఉండే ఐదు ఎముకల్లో ఒకటి విరిగినట్టు తేలడంతో సిరీస్లో మళ్లీ తనను చూడలేం అనుకుంటున్న సమయంలో బ్యాట్ పట్టుకొని.. డ్రెస్సింగ్ రూం నుంచి కుంటుతూ గ్రౌండ్లోకి వచ్చిన పంత్ రియల్ ఫైటర్ అనిపించాడు. విరిగిన పాదానికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే స్పెషల్ షూ ( మూన్ బూట్) వేసుకొని క్రీజులోకి వచ్చిన అతను చేసిన రన్స్ జట్టుకు ఎంతో విలువైనవిగా మారాయి. తీవ్రమైన నొప్పి బాధిస్తుండగా.. వికెట్ల మధ్య పరుగు తీసేందుకు ఇబ్బంది పడిన అతను ఇంగ్లిష్ పేసర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
స్టోక్స్, ఆర్చర్ యార్కర్లు సంధించినా వెనక్కు తగ్గని పంత్ సిక్స్, ఫోర్ కొట్టి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాడు. ఈ క్రమంలో అతను చేసిన ఫిఫ్టీ .. సెంచరీ అంత విలువైనది అనొచ్చు. ఆ వెంటనే ఔటైనా ప్రత్యర్థులు కూడా పంత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. 2002లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే దవడ విరిగినా 14 ఓవర్లు బౌలింగ్ చేయడం ఇండియన్ క్రికెట్లో అత్యంత ధైర్యవంతమైన ఆటగా నిలిచిపోగా.. ఇప్పుడు పంత్ పోరాటం కూడా చాన్నాళ్లు గుర్తుండిపోవడం ఖాయం.
- 5 ఒక టెస్ట్ సిరీస్లో అత్యధికంగా ఐదుసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఇండియా కీపర్గా పంత్ రికార్డుకెక్కాడు.
- ఫారూఖ్ ఇంజినీర్ (1973లో ఇంగ్లండ్పై ), ఎంఎస్ ధోనీ (2009లో ఆసీస్పై)నాలుగు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు కొట్టారు.
- 90 టెస్టుల్లో అత్యధికంగా 90 సిక్సర్లు కొట్టిన ఇండియన్గా పంత్.. మాజీ ఓపెనర్ సెహ్వాగ్ రికార్డు సమం చేశాడు.
- 8 ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 8 ఏండ్ల తర్వాత తొలిసారి టెస్టుల్లో ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేశాడు. చివరగా 2017లో వెస్టిండీస్పై లార్డ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.