ప్రగతి భవన్‌లో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రగతి భవన్‌లో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా ఈసారి వేడుకలను గోల్కొండ కోటలో కాకుండా.. ప్రగతి భవన్‌కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆగస్ట్ 15న  ఉదయం 10.30 కి ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా స్థాయిలో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

మరోవైపు ఆగస్టు 15వ తేదీన ఏయే జిల్లాల్లో ఎవరు జెండాను ఆవిష్కరించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న(బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

ఉదయం10:30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. అలాగే.. మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్లు ఉపయోగించాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జెండాను ఎగరవేసిన తర్వాత  స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ వస్తోంది.