బెంగళూరు: సౌతాఫ్రికా–ఎతో జరిగిన రెండో అనధికార టెస్ట్లో ఇండియా–ఎ ఓటమిపాలైంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా బౌలింగ్ వైఫల్యంతో కాపాడుకోలేకపోయింది. దాంతో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. 417 రన్స్ లక్ష్య ఛేదనలో 25/0 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 98 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఓపెనర్లు జోర్డాన్ హెర్మన్ (123 బాల్స్లో 13 ఫోర్లు, 1 సిక్స్తో 91), లెసెగో సెనోక్వానే (77) ఇండియా బౌలర్ల దుమ్ము దులిపారు. సిరాజ్ (1/53), ఆకాశ్ దీప్ (1/106)ను లక్ష్యంగా చేసుకుని బౌండ్రీల వర్షం కురిపించారు.
తొలి వికెట్కు 156 రన్స్ జోడించి హెర్మన్ వెనుదిరిగినా.. వన్డౌన్లో జుబేర్ హమ్జా (88 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 77) చెలరేగాడు. ఓ ఎండ్లో ప్రసిధ్ కృష్ణ (2/49) పొదుపుగా బౌలింగ్ చేసినా.. రెండో ఎండ్లో మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. 10 ఓవర్ల తర్వాత దూబే.. సెనోక్వానేను ఔట్ చేయడంతో రెండో వికెట్కు 41 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 197/2 వద్ద వచ్చిన టెంబా బవుమా (59) నిలకడగా ఆడాడు. ఇండియాతో టెస్ట్ సిరీస్ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాడు. అవతలి వైపు ధనాధన్ షాట్లతో రెచ్చిపోయిన హమ్జా మూడో వికెట్కు 107 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత కెప్టెన్ మార్కెస్ అకెర్మాన్ (24) ఔటయ్యాడు. కొద్దిసేపటికే బవుమా కూడా వికెట్ ఇవ్వడంతో సఫారీ జట్టు 352/5తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో కానర్ ఎస్టర్హుయిజెన్ (54 బాల్స్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 52 నాటౌట్) ఇండియా బౌలింగ్ను దంచికొట్టాడు. టియాన్ వాన్ వురెన్ (20 నాటౌట్)తో కలిసి విజయానికి కావాల్సిన 65 రన్స్ జోడించాడు. ఓవరాల్గా ఇవాళ ఒక్క రోజే 392 రన్స్ చేసిన సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్ష్ దూబే ఒక్క వికెట్ తీశాడు. అకెర్మాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ధ్రువ్ జురెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల అనధికార వన్డే సిరీస్ గురువారం నుంచి ప్రారంభమవుతుంది.
