టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే కళ్లు చెదరడం ఖాయం..!

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే కళ్లు చెదరడం ఖాయం..!

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026  విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారీ నజరానా ప్రకటించింది. ఇండియాకు వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందించిన సూర్యకుమార్ యాదవ్ సేనకు రూ.131 కోట్ల కళ్లు చెదిరే నగదు బహుమతి ప్రకటించింది. 

ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది, సెలెక్టర్లందరికీ కలిపి రూ. 131 కోట్లు పంపిణీ చేయనున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని అందజేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. 

కాగా, 2024 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియా గెల్చిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు అప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ఇక, 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సూర్యకుమార్ సేనకు బీసీసీఐ రూ.131 కోట్ల నజరానా ప్రకటించింది. 2024  కంటే ఈసారి రూ. 6 కోట్లు అధికంగా నజరానాను పెంచింది బీసీసీఐ. 

టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. 2026, మార్చి 8న గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‎ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‎లో రాణించి ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఓవరాల్‎గా మూడుసార్లు (2007, 2024, 2026) టీ20 వరల్డ్ కప్‎ను టీమిండియా ముద్దాడింది.

గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) రాణించారు. చివర్లో శివమ్ దూబే 8 బంతుల్లో 26 రన్స్ చేసి మెరుపు ఫినింగ్ ఇచ్చాడు. 

న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3 వికెట్లు సాధించాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే చాపచుట్టేసింది. ఆది నుంచి భారత బౌలర్లు బెంబేలెత్తించడంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ ఛేధన వైపు సాగలేదు. 

న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ సీఫెర్ట్ ఒక్కడే హాఫ్ సెంచరీతో (52) ప్రతిఘటించాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 43 పోరాడాడు. మిలిగిన బ్యాటర్లంతా చేతులేత్తేయడంతో వరల్డ్ కప్‎కు అడుగు దూరంలోనే న్యూజిలాండ్ బోల్తా కొట్టింది.