న్యూఢిల్లీ: రొటేషన్ పద్ధతిలో ఆగస్టు నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. ఆదివారం బాధ్యతల స్వీకారం తర్వాత ఐక్యరాజ్య సమితిలోభారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ టీఎస్ తిరుమూర్తి వీడియో మెసేజ్ ద్వారా.. జులైలో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఫ్రాన్స్, ఇండియాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. "ఆగస్టు నెలలో పలు కీలకమైన అంశాలు సెక్యూరిటీ కౌన్సిల్ ఎజెండాలో ఉన్నాయి. ఈ ప్రెసిడెన్సీ పీరియడ్లో ఇండియా మూడు హైలెవల్ మీటింగ్స్ నిర్వహించనుంది. మారిటైమ్ సెక్యూరిటీ, ప్రపంచ శాంతి, కౌంటర్ టెర్రరిజం అంశాలపై తీర్మానాలు ఉంటాయి"అని చెప్పారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీస్కీపర్స్ గౌరవార్థం ఇండియా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహిస్తుందన్నారు. సిరియా, ఇరాక్, సొమాలియా, యెమెన్ సహా పలు ఆగ్నేయాసియా దేశాల్లో పరిస్థితులపైనా కీలక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తిరుమూర్తి చెప్పారు. అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేసే భారత్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు.
భద్రతా మండలి బాధ్యతలను భారత్ తీసుకోవడంపై ఇండియాలో ఫ్రాన్స్ అంబాసిడర్ ఎమ్మాన్యుయెల్ లెనైన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్య పరిష్కారానికి భారత్ తన కృషి చేస్తుందన్నారు. ఈ విషయంలో భారత్కు తమ సహకారం అందుతుందని చెప్పారు.