- సౌతాఫ్రికాతో ఐదో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ
- 2025ని విజయంతో ముగించిన టీమిండియా
- 3-1తో సిరీస్ కైవసం
- దంచికొట్టిన తిలక్, పాండ్యా
- రాణించిన వరుణ్ చక్రవర్తి, బుమ్రా
- టీ20 సిరీస్ మనదే
ఐదో టీ20లో టీమిండియా 30 రన్స్ తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఫలితంగా 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన లాస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్చేసిన ఇండియా 20 ఓవర్లలో 231/5 భారీ స్కోరు చేసింది. చేజింగ్లో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 201/8 స్కోరు చేసి ఓడింది.
అహ్మదాబాద్: టీ20ల్లో టీమిండియాకు ఎదురులేదని మరోసారి రుజువైంది. ఈ ఏడాది తమ చివరి టీ20లో సౌతాఫ్రికా పని పట్టి షార్ట్ ఫార్మాట్లో వరుసగా ఎనిమిదో సిరీస్ సొంతం చేసుకున్న ఇండియా 2025కి అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చింది. రెండు నెలల్లో జరిగే టీ20 వరల్డ్ కప్ ముంగిట కాన్ఫిడెన్స్ పెంచుకుంది.
తిలక్ వర్మ (42 బాల్స్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 73), హార్దిక్ పాండ్యా (25 బాల్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) మెరుపు బ్యాటింగ్కు తోడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4/53), పేసర్ జస్ప్రీత్ బుమ్రా (2/18) మ్యాజిక్ చేయడంతో శుక్రవారం జరిగిన చివరి, ఐదో టీ20లో 30 రన్స్ తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఫలితంగా 3–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఇండియా తొలుత 20 ఓవర్లలో 231/5 భారీ స్కోరు చేసింది.
కార్బిన్ బాష్ (2/44) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్లో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 201/8 స్కోరు చేసి ఓడింది. క్వింటన్ డికాక్ (35 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), డెవాల్డ్ బ్రెవిస్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓ వికెట్ కూడా తీసిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, వరుణ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. ఇండియా జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో
జరిగే వన్డే సిరీస్లో తలపడనుంది.
ధనాధన్ ఫటాఫట్
సిరీస్ విన్నర్ను తేల్చే మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్లో దుమ్మురేపింది. గాయపడ్డ శుభ్మన్ గిల్ ప్లేస్లో బరిలోకి దిగిన సంజూ శాంసన్ (22 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (21 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 34) జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేను సద్వినియోగం చేసుకుంటూ స్టార్టింగ్ నుంచే జోరు చూపెట్టారు. యాన్సెన్ వేసిన రెండో ఓవర్లో అభి హ్యాట్రిక్ ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పగా.. శాంసన్ సిక్స్తో టచ్లోకి వచ్చాడు. బార్ట్మన్ ఓవర్లో సంజూ మూడు ఫోర్లు కొట్టగా...బాష్ ఓవర్లో సిక్స్తో అలరించిన అభి తర్వాతి బాల్కే కీపర్కు క్యాచ్ ఇచ్చాడు.
దాంతో తొలి వికెట్కు 63 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఇక వన్డౌన్లో వచ్చి తొలి బాల్కే బౌండ్రీ కొట్టిన తిలక్ తన ఫామ్ కొనసాగించినా శాంసన్ను లిండే, పేలవ ఫామ్ కొనసాగించిన కెప్టెన్ సూర్యకుమార్ (5)ను బాష్ ఔట్ చేయడంతో సఫారీ బౌలర్లు పుంజుకునేలా కనిపించారు. కానీ, తిలక్కు పాండ్యా తోడైన తర్వాత ఇండియా ఇన్నింగ్స్ జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. ఎదుర్కొన్న తొలి బాల్నే లాంగాఫ్ మీదుగా పాండ్యా ఖతర్నాక్ సిక్స్ కొట్టాడు.
లిండే వేసిన 14వ ఓవర్లో తిలక్ భారీ సిక్స్తో అలరించగా.. హార్దిక్ వరుసగా 4, 6, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ ఓవర్లో ఏకంగా 27 రన్స్ వచ్చాయి. ఎంగిడి బౌలింగ్లో రెండు ఫోర్లు రాబట్టిన తిలక్ 30 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బాష్ బౌలింగ్లో 6, 4, 6తో చెలరేగిన పాండ్యా 16 బాల్స్లోనే హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. అదే జోరులో స్కోరు 200 మార్కు దాటించిన పాండ్యా ఆఖరి ఓవర్లో ఔటైనా.. శివం దూబే (10 నాటౌట్) 6, 4తో ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
డికాక్ మెరిసినా..
భారీ టార్గెట్ ఛేజింగ్లో సఫారీ టీమ్ సైతం అదరగొట్టింది. ఫామ్ను కొనసాగించిన డికాక్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో అర్ష్దీప్కు వెల్కం చెప్పాడు. అర్ష్దీప్ తర్వాతి ఓవర్లో ఫోర్, మూడు సిక్సర్లతో 23 రన్స్ రాబట్టాడు. అతని జోరుకు 3.3 ఓవర్లలోనే సఫారీ స్కోరు 50 దాటింది. మరో ఎండ్లో ఇబ్బంది పడ్డ రీజా హెండ్రింక్స్ (13)ను ఏడో ఓవర్లో ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు.
అయినా వెనక్కు తగ్గని డికాక్కు బ్రెవిస్ తోడయ్యాడు. వరుణ్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఈ ఇద్దరూ చెరో ఫోర్, సిక్స్తో 23 రన్స్ పిండుకున్నారు. పదో ఓవర్లో బౌలింగ్కు దిగిన హార్దిక్కు బ్రెవిస్ 4, 6, 4తో స్వాగతం పలకడంతో సౌతాఫ్రికా 118/1తో బలమైన స్థితిలో నిలిచింది.
కానీ, డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇండియా బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టారు. జోరు మీదున్న డికాక్ను బుమ్రా రిటర్న్ క్యాచ్తో ఔట్ చేయగా..
బ్రెవిస్ను పాండ్యా వెనక్కుపంపాడు. ఆ వెంటనే వరుణ్ చక్రవర్తి వరుస బాల్స్లో మార్క్రమ్ (6), డొనోవాన్ (0)ను పెవిలియన్ చేర్చడంతో ప్రత్యర్థి 135/5తో డీలా పడగా.. మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. అర్ష్దీప్ బౌలింగ్లో మిల్లర్ (18), చక్రవర్తి ఓవర్లో లిండే (16) ఔటవగా.. యాన్సెన్ (14)ను పెవిలియన్ చేర్చిన బుమ్రా విజయం ఖాయం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 231/5 (తిలక్ వర్మ 73, పాండ్యా 63, బాష్ 2/44)
సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 201/8 (డికాక్ 65, బ్రెవిస్ 31, వరుణ్ 4/53, బుమ్రా 2/17)
16 ఈ మ్యాచ్లో పాండ్యా 16 బాల్స్లోనే ఫిఫ్టీ కొట్టాడు. దాంతో ఇండియా తరఫున టీ20ల్లో సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ యువరాజ్ సింగ్ (12 బాల్స్) పేరిట ఉంది.
8 టీ20ల్లో ఇండియాకు వరుసగా ఇది ఎనిమిదో సిరీస్ విక్టరీ 2023 డిసెంబర్ నుంచి ఒక్క సిరీస్ కూడా ఓడలేదు. ఇక, స్వదేశంలో వరుసగా 18 టీ20 సిరీస్ల్లో అజేయంగా నిలవడం విశేషం.
