దంబుల్లా: వన్డే వరల్డ్కప్ తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్లో ఇండియా విమెన్స్ టీమ్ సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత తమ కొత్త ప్రయాణాన్ని అద్భుత విజయంతో ఆరంభించింది. చిన్న టార్గెట్ను కాపాడుకునే క్రమంలో బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20లో హర్మన్ప్రీత్ కెప్టెన్సీలోని ఇండియా 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 138/6 స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (27 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 36 నాటౌట్) టాప్ స్కోరర్. ఓపెనర్ షెఫాలీ వర్మ (31 బాల్స్లో 4 ఫోర్లతో 31), కెప్టెన్ హర్మన్ ప్రీత్ (20 బాల్స్లో 3 ఫోర్లతో 22) రాణించారు. కానీ, స్మృతి మంధాన (1), సబ్బినేని మేఘన (0) నిరాశ పరిచారు.
లోయర్ ఆర్డర్లో రిచా ఘోశ్ (11), పూజా వస్త్రాకర్ (14), దీప్తి శర్మ (17 బ్యాటింగ్)తో కలిసి రోడ్రిగ్స్ జట్టుకు కాపాడుకునే స్కోరు ఇచ్చింది. లంక బౌలర్లలో యినొకా రణవీర (3/30), ఒషాడి రణసింఘె (2/22) రాణించారు. అనంతరం ఛేజింగ్కు వచ్చిన శ్రీలంక ఓవర్లన్నీ ఆడి 104/5 స్కోరు మాత్రమే చేసి ఓడింది. కవిషా దిల్హారి (47 నాటౌట్) పోరాడినా మిగతా ప్లేయర్లు ఆమెకు సహకరించలేకపోయారు. ఇండియా బౌలర్లంతా ప్రత్యర్థిని కట్టడి చేశారు. రాధా యాదవ్ (2/22), దీప్తి శర్మ (1/9), పూజా వస్త్రాకర్ (1/13), షెఫాలీ వర్మ (1/10) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు విజయం అందించారు. జెమీమా రోడ్రిగ్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్లో రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది.