గ్లాస్గో: స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్26) ఓ ముఖ్యమైన నిర్ణయంతో ముగిసింది. గ్రీన్ హౌస్ వాయువులు పెరగడానికి కారణమవుతున్న బొగ్గు, ఫాజిల్ ఫ్యూయెల్స్ వాడకాన్ని ఒకేసారి తగ్గించడం (ఫేజ్ఔట్) కాకుండా దశల వారీగా (ఫేజ్ డౌన్) తగ్గించుకుందామని ఇండియా చేసిన ప్రతిపాదనకు దాదాపు 197 దేశాలు అంగీకరించాయి. గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్కు ఓకే చెప్పాయి. కార్బన్ ఎమిషన్స్ను తగ్గించుకోవడంపై చర్చించేందుకు వచ్చే ఏడాది సమావేశం కావడానికి ఒప్పుకున్నాయి. ‘2030 నాటికి కార్బన్ ఎమిషన్స్ను సగానికి తగ్గించడం, అభివృద్ధి చెందిన దేశాల నుంచి రూ. 7.5 లక్షల కోట్లను పొందడం, ఆ డబ్బులో సగాన్ని వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖర్చు చేసే విషయమై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. ఇందులో ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోయాం. కానీ మరో మంచి నిర్ణయమైతే తీసుకోగలిగాం’ అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ కీలక ఒప్పందం భూమి, మనుషులు సమస్యల్లేకుండా బతికేందుకు ఓ ముందడుగని కాప్26 అధ్యక్షుడు అలోక్ శర్మ చెప్పారు.
విపరీతంగా వాడొద్దు..
కోల్పవర్ను పూర్తిగా తగ్గించడానికి బదులు దశల వారీగా తగ్గిస్తామని చెప్పడంతో తీవ్రంగా నిరాశ చెందామని మరికొన్ని దేశాలు అన్నాయి. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. పేదరికాన్ని తగ్గించేందుకు, అభివృద్ధి చెందేందుకు కష్టపడుతున్న డెవలపింగ్ దేశాలు బొగ్గు, పెట్రోల్, డీజిల్లాంటి ఫాజిల్ ఫ్యూయెల్స్పై సబ్సిడీలను ఎలా తగ్గించుకోగలవని అన్నారు. ఫాజిల్ ఫ్యూయెల్స్ను రెస్పాన్సిబుల్గా వాడుకోవడం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కు అని చెప్పారు.
గ్లాస్గో సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
- 2030 నాటి కల్లా సాధించాల్సిన క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ను దేశాలు మరింత బలంగా తయారు చేసుకోవాలి. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాన్స్ను సమర్పించాలి.
- కార్బన్ ఎమిషన్స్ను తగ్గించేందుకు దేశాలు ఏం చేస్తున్నాయో ప్రతి సంవత్సరం నివేదికివ్వాలి.
- బొగ్గును ఫ్యూయెల్గా వాడటం తగ్గించాలి. ఫాజిల్ ఫ్యూయెల్స్పై రాయితీలను ఎత్తేయాలి.
- వాతావరణ మార్పులపై పేద దేశాలు పని చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చే ఫండ్స్ రెట్టింపు చేయాలి.
- 2025 వరకు ఏటా 100 బిలియన్ డాలర్ల సొమ్మును అభివృద్ధి చెందిన దేశాలు అందించాలి. ఈ దేశాలు ఫండ్స్ను ఎలా అందించబోతున్నాయో ప్లాన్ను ఇవ్వాలి.
