
కౌలాలంపూర్: ఆసియా స్క్వాష్ డబుల్స్ చాంపియన్షిప్లో ఇండియా బరిలోకి దిగిన మూడు విభాగాల్లో టైటిల్స్ను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన విమెన్స్ డబుల్స్ ఫైనల్లో జోష్న చిన్నప్ప–-అనహత్ సింగ్ 2–-1 (8–-11, 11–-9, 11–-10)తో ఐనా అమని–జిన్ యింగ్ యి (మలేసియా)ను ఓడించారు. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిపడినా తర్వాత తేరుకున్న ఇండియన్ ద్వయం 35 నిమిషాల్లోనే ప్రత్యర్థులకు చెక్ పెట్టారు. తద్వారా ఈ టోర్నీలో విమెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్ జంటగా జోష్న–అనహత్ రికార్డులకెక్కారు.
మెన్స్ డబుల్స్ టైటిల్ ఫైట్లో అభయ్ సింగ్–వెలావన్ సెంథిల్కుమార్ 2–1 (9–11, 11–5, 11–5)తో నూర్ జమాన్–నాసిర్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై నెగ్గారు. 88 నిమిషాల మ్యాచ్లో ఇండియన్స్ తొలి సెట్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అభయ్–అనహత్ 2–0 (11–9, 11–7)తో రాయెల్ అర్నాల్డ్–అమీషేన్రాజ్ చందరన్ (మలేసియా)ను చిత్తు చేశారు. ఈ చాంపియన్షిప్లో అభయ్–అనహత్కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం.