కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇండియా భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (177 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 115 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు రిషబ్ పంత్ (89 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీ సాధించడంతో సోమవారం రెండో రోజు ఇండియా తొలి ఇన్నింగ్స్ను 138 ఓవర్లలో 503/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 ఓవర్లలో 8/2 స్కోరు చేసింది. లాహిరు ఉడార (1), ప్రభాత్ జయసూర్య (2) నిరాశపర్చగా, కమిల్ మిశార (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక ఇంకా 495 రన్స్ వెనకబడి ఉంది.
112 రన్స్ భాగస్వామ్యం..
300/5 ఓవర్నైట్ స్కోరు వద్ద రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియాకు డే రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 87వ ఓవర్లో అసితా ఫెర్నాండో (4/106) వేసిన గుడ్ లెంగ్త్ బాల్ సారాన్ష్ జైన్ (6) బ్యాట్ను తాకి రెండో స్లిప్లో మిశారా చేతుల్లోకి వెళ్లింది. దాంతో ఇండియా స్కోరు 307/6గా మారింది. తొలి రోజు గాయంతో రిటైర్డ్ హర్ట్ అయిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి రావడం ఇండియాకు ప్లస్గా మారింది.
ఫిట్నెస్పై ఆందోళన నెలకొన్నా.. దాదాపు రెండు గంటల పాటు బ్యాటింగ్ చేసిన పంత్.. రెండో ఎండ్లో జురెల్ మంచి సహకారం అందించాడు. పేసర్లు ఫెర్నాండో, లాహిరు కుమార (1/68) బౌన్సర్లతో పంత్ బాడీని లక్ష్యంగా చేసుకున్నా ఏమాత్రం ఇబ్బందిపడలేదు. మధ్యలో ఫెర్నాండో వేసిన బౌన్సర్ పంత్ భుజానికి గట్టిగా తగిలినా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. అదే టైమ్లో కుమార వేసిన షార్ట్ పిచ్ బాల్ను ఫైన్ లెగ్ మీదుగా హుక్ షాట్తో సిక్సర్గా మలవడం పంత్ ఇన్నింగ్స్లో హైలెట్.
చివరకు స్పిన్నర్ కేశర నువాంత (2/154) బౌలింగ్లో ఫుల్ షాట్తో 81 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అవతలివైపు జురెల్ కూడా చాలా నిలకడగా ఆడాడు. ప్రభాత్ జయసూర్య (2/132) వేసిన ఆర్మ్బాల్ బ్యాట్ను తాకి ప్యాడ్లకు టచ్ కావడంతో బౌలర్ ఎల్బీకి అప్పీల్ చేయడం కాస్త ఉత్కంఠ రేపింది. కానీ రీప్లేలో నాటౌట్గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు. చివరకు జయసూర్య బౌలింగ్లోనే ఫుల్ షాట్తో 97 బాల్స్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడతో ఇండియా 419/6 స్కోరుతో లంచ్కు వెళ్లింది.
వర్షం అడ్డంకి..
లంచ్ బ్రేక్ తర్వాత తొలి బాల్కే పంత్ ఔట్ కావడంతో ఇండియాకు ఈ సెషన్ సానుకూలంగా సాగలేదు. కేశార నువాంత (2/154) బౌలింగ్లో పంత్ బంతిని గాల్లోకి కొట్టగా.. బౌండ్రీ వద్ద లాహిరు ఉడార ఈజీగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఏడో వికెట్కు 112 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అప్పటికి జురెల్ 59 రన్స్ వద్దే ఉన్నా.. మానవ్ సుతార్ (18) రూపంలో బలమైన భాగస్వామి లభించాడు. ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్న జురెల్ వేగంగా రన్స్ రాబట్టాడు.
అయితే రెండో ఎండ్లో జయసూర్య బౌలింగ్లో కాస్త ఇబ్బందిపడ్డ సుతార్ 125వ ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో ఎనిమిదో వికెట్కు 54 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. మరో ఆరు ఓవర్ల తర్వాత వర్షం పడటంతో ఇండియా టీ బ్రేక్ తీసుకుంది. జురెల్ 95 వద్ద ఉండగా, సిరాజ్ (3) ఇంకా ఖాతా తెరవలేదు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత జురెల్ 171 బాల్స్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్కు 31 రన్స్ జత చేసి సిరాజ్ ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన ప్రసిధ్ కృష్ణ (4 నాటౌట్), జురెల్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 138 ఓవర్లలో 503/9 డిక్లేర్డ్ (జురెల్ 115*, పంత్ 63, అసితా ఫెర్నాండో 4/106).శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 3 ఓవర్లలో 8/2 (కమిల్ మిశార 5*, ప్రసిధ్ కృష్ణ 1/1, సుతార్ 1/6).
