
- ఇజ్రాయెల్ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం
- పేలుడు జరిగిన చోట లేఖ లభ్యం
- ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు పోలీసుల వెల్లడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని చాణక్యపురిలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ లేఖ లభ్యమైందని, దానిని నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించారు. మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన పేలుడుతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఎన్ఎస్జీ, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని సందర్శించి కొన్ని ఆధారాలు సేకరించారు. రెండు జాగిలాలతో ఎన్ఎస్జీ డాగ్ స్క్వాడ్ బృందం సమీపంలో సోదాలు చేపట్టింది.
ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రాయబార కార్యాలయం వద్ద తచ్చాడినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఎంబసీ సమీపంలో ‘సర్ అల్లాహ్ రెజిస్టెన్స్’ పేరుతో ఇజ్రాయెల్ జాతీయ పతాకం, దానిలో ఓ లేఖ కూడా లభించినట్లు తెలుస్తున్నది. ఆ లేఖలో ఇంగ్లీషులో ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా వంటి పదాలు ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. పేలుడు సంభవించిన తర్వాత పోలీసులు ఢిల్లీలో పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పేలుడుకు ముందు ఇజ్రాయెల్ఎంబసీ చుట్టుపక్కల ఏయే నెంబర్లు యాక్టివ్లో ఉన్నాయి. ఆ కాల్స్లో ఏం సంభాషణ జరిగిందనే విషయాలు తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.