కూలిడ్గె (ఆంటిగ్వా): అండర్–19 వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే సెమీఫైనల్లో స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. రెండు టీమ్ లు బలంగా కనిపిస్తుండటంతో విక్టరీ ఎవరిదా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఇండియా గత ఎడిషన్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి కొద్దిలో ట్రోఫీ మిస్ చేసుకుంది. కానీ, మొన్నటి క్వార్టర్స్లో బంగ్లాను ఓడించి సెమీస్కు వచ్చిన టీమ్.. అదే జోరుతో ఆసీస్ పని పట్టి కప్పు ముంగిట నిలవాలని చూస్తోంది. అయితే, అన్ని డిపార్ట్మెంట్లలో బలంగా ఉన్న ఆసీస్ టీమ్ ను తక్కువ అంచనా వేయలేం. ఇప్పటికే రెండుసార్లు ఈ మెగాటోర్నీ టైటిల్ గెలిచిన కంగారూ టీమ్ 2010 తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవాలని ఆశిస్తోంది. కాగా, కొవిడ్ బారినపడిన ఐదుగురు ప్లేయర్లు కోలుకోవడం మన టీమ్కు ప్లస్ పాయింట్. కరోనాతో క్వార్టర్స్ మ్యాచ్ కు దూరమైన నిశాంత్ సంధు కూడా తిరిగి టీమ్ లోకి వస్తున్నాడు. మరి జోరుమీదున్న యంగ్ ఇండియా.. ఆసీస్ అడ్డు దాటుతుందో లేదో చూడాలి.
కరోనా దెబ్బకొట్టినా.. కసిగా ఆడుతూ
ఫస్ట్ మ్యాచ్లోనే బలమైన సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియాను కరోనా దెబ్బకొట్టింది. గ్రూప్ స్టేజ్లో సెకండ్ మ్యాచ్కు (ఐర్లాండ్ తో )ముందు కరోనా సోకడంతో కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తో పాటు ఆరాధ్య యాదవ్, మానవ్ పరాఖ్, సిద్దార్థ్ యాదవ్ ఐసోలేషన్కు వెళ్లారు. మ్యాచ్కు పదకొండు మంది ప్లేయర్లను బరిలోకి దింపడమే కష్టంగా మారింది. దాంతో, ట్రోఫీ సంగతి పక్కనబెడితే మనోళ్లు సెమీస్ వరకైనా వెళ్తారా? అన్న డౌట్స్ వచ్చాయి. అయితే స్టాండిన్ కెప్టెన్ నిశాంత్ సంధు నాయకత్వంలో టీమ్ కసిగా ఆడుతూ ఐర్లాండ్ తో పాటు ఉగాండాతో జరిగిన మ్యాచ్లో రికార్డు విజయం అందుకొని గ్రూప్ టాపర్గా నాకౌట్ చేరుకుంది. అదే జోరుతో బంగ్లాను కూడా పడగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్లో ఇండియా దుమ్మురేపుతోంది. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ రషీద్, ఓపెనర్ హర్నూర్ సింగ్ ఆసియా కప్ నుంచే సూపర్ ఫామ్లో ఉండగా, ఉగాండాతో మ్యాచ్ లో రికార్డు సెంచరీలు కొట్టిన రఘువన్షి, రాజ్ బవా ఈ మ్యాచ్ లోనూ రాణించాలని చూస్తున్నారు. ఇక, బంగ్లాపై ఐదు వికెట్లతో రాణించిన పేసర్ రవి కుమార్ తో పాటు రాజ్ వర్ధన్, స్పిన్నర్ విక్కీ, కౌశల్ తాంబేతో ఇండియా బౌలింగ్ కూడా తిరుగులేనట్టే ఉంది. కొవిడ్ తో క్వార్టర్స్ ఆడని నిశాంత్ కోలుకోవడం టీమ్ కు ప్లస్ కానుంది. కుర్రాళ్లంతా సమష్టిగా ఆడితే సెమీస్లో ఆసీస్ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
కంగారూలతో కేర్ ఫుల్..
ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నీలో బలమైన టీమ్ గా కొనసాగుతోంది. గ్రూప్ దశలో వెస్టిండీస్, స్కాట్లాండ్ టీమ్స్ ను ఓడించిన కంగారూ టీమ్.. శ్రీలంక చేతిలో కంగుతిన్నది. అయినా గ్రూప్–డిలో సెకండ్ ప్లేస్ తో ఆసీస్ క్వార్టర్స్ చేరింది. నాకౌట్ ఫైట్లో మాత్రం తిరుగులేని ఆటతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఆ టీమ్ ఓపెనర్ టీగ్ వైలీని ఆసీస్ ఫ్యూచర్ స్టార్ గా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ టోర్నీలో ఓ సెంచరీ, రెండు ఫిఫ్టీలతో కంగారూ టీమ్ విక్టరీల్లో కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్ తో క్వార్టర్స్ లోనూ 71 రన్స్ తో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వైలీతో పాటు బ్యాటింగ్ లో కెప్టెన్ కూపర్ కనోలి, క్యాంప్ బెల్ కెలావె మంచి టచ్ లో ఉన్నారు. బౌలింగ్ లో టామ్ విట్నీ, సాల్జమన్ రాణిస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియా పక్కా ప్లాన్తో రావాలి.
