వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారత్.. ఎన్నడూ మరో దేశంపై దండయాత్ర చేయలేదన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారతీయ పరంపర, సంస్కృతి వసుదైక కుటుంబం అని, సర్వే జనా సుఖినోభవంతో అని మన ఇతిహాసాలు తెలిపాయన్నారు. వాస్తవాధీన రేఖ దగ్గర ఉన్న పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేసిన తర్వాత వెంకయ్యనాయుడు మాట్లాడారు. మన అందరం కలిసి కట్టుగా సైన్యం వెంట ఉన్నామని తెలిపారు.
ఈ క్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్కు సూచన చేశారు. ఎవరైనా సభ్యులు కానీ, అధికారులు కానీ ఈ అంశం గురించి చర్చించాలనుకుంటే.. వారితో వీలైతే ఏకాంతంగా కూడా మాట్లాడాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రత అంశంలో అందరూ ఆసక్తిగా ఉంటారన్నారు. వాస్తవంగా ఎల్ఏసీ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో తెలియాలని విపక్షాలకు ఉంటుందని, వారికి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని వెంకయ్య సూచించారు. విపక్ష సభ్యులను విశ్వాసంలోకి తీసుకుని వారికి ప్రభుత్వ విధానం తెలియచేయాలన్నారు.