
- ఎంపీఎల్తో ఎంఓయూ
హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ‘ఇండియా జాయ్ 2021’ హైదరాబాద్లో మంగళవారం షురూ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (త్వాగా), మొబైల్ ప్రీమియం లీగ్ (ఎంపీఎల్) దీనిని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్నిప్రారంభించారు. గేమింగ్, వీఎఫ్ఎక్స్ కంపెనీల కోసం నిర్మించబోయే ఇమేజ్ టవర్స్లో ఎంపీఎల్కు 500 సీట్లు కేటాయించేందుకు ఈవెంట్లో భాగంగా వీఎఫ్ఎక్స్, యానిమేషన్, ఓటీటీ, గేమ్లు, సినిమాలు, టీవీ, కామిక్స్, యానిమేషన్ ఎక్స్పర్టులతో ప్యానెల్ డిస్కషన్లు నిర్వహించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈవెంట్లో వర్క్షాప్లు, ట్రేడ్ ఎగ్జిబిషన్లు, ప్రొడక్టుల లాంచ్ల వంటి ఇతర కార్యక్రమాలూ ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. కంటెంట్, గేమింగ్ డెవలపర్లు, కస్టమర్లు, హార్డ్వేర్ కంపెనీలు, స్టూడెంట్లు, నెట్వర్కింగ్ కంపెనీల ప్రతినిధులూ హాజరయ్యారు. సినీ నటుడు సుధీర్ బాబు, సీఐఐ నేషనల్ కమిటీ మెంబర్ వీరేన్ ఘోష్ తదితరులు కూడా ఈవెంట్కు వచ్చారు.
హైదరాబాద్లో ఎన్నో అవకాశాలు...
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలోనూ హైదరాబాద్ గేమింగ్ కంపెనీలు ఎన్నో అవకాశాలను సంపాదించుకున్నాయని మెచ్చుకున్నారు. సిటీలో గత రెండేళ్లలో 45 వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఏర్పడ్డాయని, మొత్తం కంపెనీల సంఖ్య 80కి చేరిందని చెప్పారు. ‘‘ సిటీలో ఇప్పటికే 20 వీఎఫ్ఎక్స్ అకాడమీలు, 40కిపైగా ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. కొందరు ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. గేమింగ్ కంపెనీల సంఖ్య 80కి చేరింది. ఇమేజ్ టవర్ పనులను 2023 మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ యానిమేషన్, మల్టీమీడియా సొల్యూషన్స్కు వన్స్టాప్ షాప్గా మారుతుంది’’ అని వివరించారు.