
న్యూఢిల్లీ: చమురు కొరతతో ఇబ్బందిపడుతున్న మనదేశానికి జాక్పాట్తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండమాన్ సముద్రంలో, గయానా స్థాయిలో భారీ చమురు నిల్వలను కనుగొనేందుకు భారత్ చాలా దగ్గరగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ నిల్వల్లో సుమారు 18,444 కోట్ల లీటర్ల ముడి చమురు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.
'ది న్యూ ఇండియన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సంస్కరణల దూకుడు, అన్వేషణ వల్ల భారీ ప్రయోజనాలు దక్కేందుకు అవకాశం ఉందని చెప్పారు. అండమాన్ ప్రాంతంలో గయానా తరహాలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు విస్తరించవచ్చని ఆయన తెలిపారు.
మన ప్రయత్నాలు సఫలమైతే, గయానా కనుగొన్న 11.6 బిలియన్ బ్యారెళ్ల నిల్వల కంటే ఎక్కువ చమురు భారత్కు దక్కవచ్చని, ఈ ఆవిష్కరణ భారతదేశ ఇంధన రంగ రూపురేఖలను మార్చగలదని మంత్రి అన్నారు. ‘‘ఇప్పటికే కృష్ణా-గోదావరి బేసిన్, ఇతర చోట్ల చిన్న చిన్న ఆయిల్ నిల్వలు దొరుకుతున్నాయి. అండమాన్లో గయానా స్థాయి డిస్కవరీ జరిగితే, ఇది గేమ్-ఛేంజర్ అవుతుంది. ఓఎన్జీసీ ఈ ఏడాది 37 ఏళ్లలో అత్యధికంగా 541 బావులు తవ్వింది. ఇందుకోసం రూ. 37 వేల కోట్లు ఖర్చు చేసింది. గయానాలో ఎన్నో బావులు తవ్వాక 41వ బావిలో ఆయిల్ దొరకింది. ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉంది”అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
దిగుమతుల నుంచి ఇంధన స్వయం ప్రతిపత్తి వైపు ?
అండమాన్లో అన్వేషణ విజయవంతమైతే, భారతదేశం చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకుని, దాని ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చు. భారతదేశం తన ఇంధన అవసరాలను తీర్చడానికి ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రభుత్వ డేటా ప్రకారం, దేశ ముడి చమురులో 85శాతం కంటే ఎక్కువ అంతర్జాతీయ సరఫరాదారుల నుంచి వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా చమురును మనదేశమే కొంటున్నది.
హర్దీప్ పూరి గయానా చమురు అన్వేషణ సంస్థ హెస్ కార్పొరేషన్ గురించి మాట్లాడుతూ అది సుమారు 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు గ్యాస్ను వెలికితీసిందని చెప్పారు. దీంతో గయానా ప్రపంచ ఇంధన మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఎదిగింది. ఇది ఇప్పుడు చమురు నిల్వల పరంగా ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. మనదేశంలో ప్రస్తుతం అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కృష్ణా-గోదావరి బేసిన్ వంటి ప్రాంతాలలో ముడి చమురు ఉత్పత్తి అవుతోంది.
విశాఖపట్నం, మంగళూరు, పడూరు వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నిర్వహిస్తున్నారు. ఒడిశా, రాజస్థాన్లలోనూ స్థలాల కోసం వెతుకుతున్నారు. అండమాన్ నికోబార్ దీవులకు ఇప్పుడు అన్వేషణ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అక్కడ ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ వంటి కంపెనీలు కొత్త నిల్వల కోసం సర్వే, డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయి.