ఏ దేశం నుంచైనా ఇంధనం కొనేందుకు భారత్ సిద్ధం: హర్దీప్ సింగ్ పురి

ఏ దేశం నుంచైనా ఇంధనం కొనేందుకు భారత్ సిద్ధం:  హర్దీప్ సింగ్ పురి

భారత్ ఇంధనాన్ని ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత్ తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం నైతిక బాధ్యత అని.. అందుకు ఏ దేశం నుంచైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనొద్దని ఏ దేశం తమకు చెప్పలేదన్నారు. అమెరికా ఇంధనశాఖ కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్‌హోమ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని హర్దీప్ సింగ్ పురి అన్నారు. దేశంలో ఉన్న జనాభా, వినియోగం దృష్ట్యా ఇంధనం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇంధనం ఖరీదుతో పాటు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇంధనం కొనుగోలు ఉంటుందన్నారు. తమ విధానల పట్ల స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు,వ్యాపారులపై పడిందని.. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసిందని హర్దీప్ అన్నారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగాయని.. ఇది భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురులో 10 శాతం ఉందని తెలిపారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ముందు రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు కేవలం 0.2 శాతం మాత్రమే అని తెలిపారు.