
బ్రిటన్: దాయాదుల సమరం కోసం ఎదురుచూస్తోన్న క్రికెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లీగ్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం.. 2025, జూలై 20న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో పాక్, ఇండియా జట్లు తలపడాల్సి ఉంది. ఈ ఉత్కంఠ పోరు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న అభిమానులకు చివరి నిమిషంలో డబ్ల్యూసీఎల్ ఊహించని షాక్ ఇచ్చింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఈ మ్యా్చ్ను రద్దు చేయాలని పలు డిమాండ్లు వచ్చాయని.. వాటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచును రద్దు చేస్తున్నట్లు తెలిపింది డబ్ల్యూసీఎల్. ఆటగాళ్లు, అభిమానుల మనోభావాలను గాయపర్చొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్, పాక్ మ్యాచ్ రద్దుపై డబ్ల్యూసీఎల్ ప్రకటన విడుదల చేసింది.
‘‘డబ్ల్యూసీఎల్లో ఎల్లప్పుడూ క్రికెట్ను ఎంతో ఆదరిస్తాం. అభిమానులకు కొన్ని మంచి, సంతోషకరమైన క్షణాలను అందించడమే మా ఏకైక లక్ష్యం. ఈ సంవత్సరం పాకిస్తాన్ హాకీ జట్టు భారతదేశానికి వస్తుందని విన్నాం. అలాగే భారత్ వర్సెస్ పాకిస్తాన్ వాలీబాల్ మ్యాచ్తో పాటు రెండు దేశాల మధ్య ఇతర వేర్వేరు క్రీడలు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే డబ్ల్యూసీఎల్లో ఇండియా, పాక్ మ్యాచ్ను నిర్వహించాలని అనుకున్నాం.
కానీ ఇది కొందరు ఆటగాళ్లు, అభిమానుల మనోభావాలను గాయపర్చింది. వాటిని దృష్టిలో పెట్టుకుని పాక్, భారత్ మ్యాచ్ను రద్దు చేస్తున్నాం’’ అని డబ్ల్యూసీఎల్ ప్రకటనలో పేర్కొంది. అంతకముందే.. ధావన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు.
కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది చనిపోయారు. ఈ టెర్రర్ ఎటాక్తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాకిస్థాన్కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్తో క్రికెట్ కూడా ఆడొద్దని పలువురు డిమాండ్ చేశారు.
ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. అన్ని దేశాల మాజీ క్రికెటర్లు ఆడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగులో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పాటు చేసింది డబ్ల్యూసీఎల్. దీనిపై భారత ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాహిది అఫ్రిదీ కెప్టె్న్గా ఉన్న జట్టుతో భారత టీమ్ మ్యాచు ఆడొద్దని డిమాండ్ చేశారు. ఇండియా టీమ్లోని ధావన్, హర్బజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కూడా పాక్తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో భారత్, పాక్ మ్యాచును రద్దు చేసింది డబ్ల్యూసీఎల్.