
- నేడు ఆస్ట్రేలియాతో ఇండియా మూడో వన్డే
- తొలి రెండు వన్డేల్లో ఓడిన ఆతిథ్య జట్టు
- మ. 1.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో
ముంబై : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఇండియా విమెన్స్ టీమ్ ఆఖరాటకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు మంగళవారం జరిగే మూడో, చివరి వన్డేలోనైనా గెలిచి వైట్వాష్ తప్పించుకోవాలని చూస్తోంది. ఏకైక టెస్టు మ్యాచ్లో ఆసీస్పై హిస్టారికల్ విక్టరీ సాధించిన హర్మన్సేన వన్డేల్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతోంది. తొలి మ్యాచ్లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన జట్టు..రెండో మ్యాచ్లో చిన్న టార్గెట్ ఛేజింగ్లో తడబడింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలంటే ఆ రెండు మ్యాచ్ల్లో తప్పిదాలను వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉంది.
సొంతగడ్డపై ఆసీస్ చేతిలో వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓడిన ఇండియా పదో పరాజయం తప్పించుకోవాలంటే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై ఇండియాకు రెండు హిస్టారికల్ టెస్టు విక్టరీలు అందించిన హర్మన్ బ్యాటర్గా మాత్రం నిరాశ పరుస్తోంది. గత నెలలో ఇంగ్లండ్తో టెస్ట్లో చేసిన 49 రన్సే ఈ సీజన్లో అన్ని ఫార్మాట్లలో ఆమె టాప్ స్కోర్ కావడం గమనార్హం. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో ఆమె మూడేసార్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేసింది. ఆస్ట్రేలియాతో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన హర్మన్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు.
ఇక, తాజా సిరీస్లో తొలి రెండు వన్డేల్లో 9, 5 స్కోర్లతో ఫెయిలైంది. టెస్టుల్లో ఇండియా సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని ఫలితం రాబట్టినప్పటికీ వన్డేల్లో మాత్రం ఆతిథ్య జట్టు బలహీనతలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తొలి మ్యాచ్లో బౌలింగ్లో తీవ్రంగా నిరాశ పరిచిన ఇండియా 282/8 స్కోరు చేసినా కూడా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఏకంగా ఏడు క్యాచ్లను డ్రాప్ చేసింది. దాంతో గెలవాల్సిన మ్యాచ్ను మూడు రన్స్ తేడాతో కోల్పోయింది.
అయితే గత పోరులో రిచా ఘోష్ వీరోచిత పోరాటం, జెమీమా రోడ్రిగ్స్ నిలకడ కాస్త ఊరట కలిగించే అంశం. ముఖ్యంగా మూడో నంబర్కు తాను సరైన ప్లేయర్నని ఘోష్ నిరూపించింది. టాపార్డర్లో దూకుడుగా ఆడే బ్యాటర్ ఉండటం ఇండియాకు కొత్త శక్తిని ఇస్తుంది. అయితే, మిడిలార్డర్లో జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను కెప్టెన్గా హర్మన్ తన భుజాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంది.
రెండో వన్డేలో బంతికో పరుగు అవసరమైన పరిస్థితిలోనూ జట్టును గెలిపించలేకపోయిన నేపథ్యంలో లోయర్ ఆర్డర్లో అమన్ జోత్, దీప్తి శర్మపైనా ఒత్తిడి ఉంది. బౌలింగ్ బాగానే ఉన్నా ఫీల్డింగ్లో తడబాటును వీడాల్సి ఉంది. 2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్నకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ టోర్నీలో ఆడే కోర్ టీమ్పై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో ముఖ్యంగా ఫీల్డింగ్లో మెరుగవ్వడంపై హర్మన్సేన దృష్టి పెట్టాలి.
క్లీన్స్వీప్ టార్గెట్గా
ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది. 2007 నుంచి ఇండియాలో ఒక్క వన్డే మ్యాచ్లో కూడా ఓడిపోని రికార్డును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మ్యాచ్లో బ్యాటింగ్లో తడబడిన నేపథ్యంలో మూడో వన్డేలో మెరుగ్గా ఆడాలని కంగారూ టీమ్ భావిస్తోంది.
ముఖ్యంగా కెప్టెన్ అలీసా హీలీ భారీ స్కోరుపై గురిపెట్టింది. హీలీ నిలకడగా డబుల్ డిజిట్స్ చేస్తున్నా.. ఇప్పటివరకు పెద్ద స్కోరు చేయలేదు. ఇక గత రెండు వన్డేల్లో ఫిఫ్టీలు చేసిన లిచ్ఫీల్డ్, ఎలైస్ పెర్రీ నుంచి ఆస్ట్రేలియా మరింత దూకుడు ఆశిస్తోంది.