విండీస్ తో తొలి టీ20: టాస్ గెలిచిన భారత్

విండీస్ తో తొలి టీ20: టాస్ గెలిచిన భారత్

కోల్‌క‌తా: వెస్టిండీస్ తో భారత్ 3 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు ఫస్ట్ టీ20 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ గెలిచి జోరును కొనసాగించాలనుకుంటుంది టీమిండియా. నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజ‌యంతో ప్రారంభించాల‌ని రెండు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. అయితే టీమిండియా ఆడిన చివ‌రి 6 మ్యాచ్‌ల్లో ఒక్క‌టి కూడా ఓడిపోకపోవడం విశేషం. మరోవైపు రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇంత వరకు ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ ఆ రికార్డును కొన‌సాగిస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ(ఫిబ్రవరి 16) వెస్టిండీస్‌తో జరిగే తొలి టీ20లో ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఈ టీమిండియా మాజీ కెప్టెన్ సిద్ధంగా ఉన్నాడు. ఇవాల్టి మ్యాచ్ లో కోహ్లి మ‌రో 73 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

ఈ జాబితాలో న్యూజిలాండ్ బ్యాట‌ర్ మార్టిన్ గుప్టిల్ 3299 ప‌రుగుల‌తో తొలి స్ధానంలో ఉండ‌గా, ప్రస్తుతం కోహ్లి 3227 ప‌రుగుల‌తో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇదే జాబితాలో 3197 ప‌రుగుల‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మూడో స్ధానంలో నిలిచాడు. రోహిత్ శ‌ర్మ సైతం ఈ మ్యాచ్ లో సెంచ‌రీ(103 పరుగులు) సాధిస్తే పొట్టి క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.