న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన, మనిషి మోసుకెళ్లగలిగే యాంటీట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఎంపీఏటీజీఎం) వ్యవస్థను భారత ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఈ ఆయుధ వ్యవస్థను డిజైన్ చేసి డెవలప్ చేసింది. లాంచర్లు, టార్గెట్ ఆక్విజిషన్ డివైజ్, ఒక ఫైర్ కంట్రోల్ యూనిట్ ఈ వెపన్ సిస్టమ్లో ఉంటాయి.
ఈ నెల 13న పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఎంపీఏటీజీఎం ఆయుధ వ్యవస్థ ఫ్లైట్ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించామని ఆర్మీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిసైల్, వార్ హెడ్ల పనితీరు ఆశించినంతమేర ఉందని చెప్పారు. పగటి పూట, రాత్రిపూట కూడా పనిచేసేలా ఈ ఆయుధ వ్యవస్థను తీర్చిదిద్దామని వెల్లడించారు. డుయెల్ మోడ్ సీకర్ ఫీచర్తోఈ మిసైల్కు అదనపు సామర్థ్యం కూడా చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ ఆయుధ వ్యవస్థకు సంబంధించి టెక్నాలజీ డెవలప్ మెంట్, పనితీరు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని ఆర్మీలో చేరుస్తామని అధికారులు వివరించారు. ఎంపీఏటీజీఎం ఆయుధ వ్యవస్థ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించినందుకు డీఆర్డీఓ, ఆర్మీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ బేస్డ్ డిఫెన్స్ సిస్టం డెవలప్ మెంట్లో స్వయంసమృద్ధి సాధించేందుకు ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.