టాటా స్టీస్ చెస్ టోర్నమెంట్‌‌.. ఆనంద్ అదే జోరు

టాటా స్టీస్ చెస్ టోర్నమెంట్‌‌.. ఆనంద్ అదే జోరు

కోల్‌‌కతా: టాటా స్టీస్ చెస్ టోర్నమెంట్‌‌లో ఇండియా లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తన క్లాస్‌‌ను చాటుకున్నాడు. కోల్‌‌కతాలో బుధవారం మొదలైన ఈ టోర్నీలో తొలి మూడు రౌండ్ల ర్యాపిడ్ గేమ్స్‌‌ ముగిసేసరికి ఆనంద్ 2.5 పాయింట్లతో అమెరికా గ్రాండ్‌‌మాస్టర్ హన్స్ నీమన్‌‌తో కలిసి టాప్ ప్లేస్‌‌లో నిలిచాడు.  దాదాపు ఆరేండ్ల తర్వాత ఈ టోర్నీకి తిరిగొచ్చిన 56 ఏండ్ల ఆనంద్ యంగ్‌‌స్టర్స్‌‌కు దీటుగా రాణించాడు.

తొలి రౌండ్‌‌లో అమెరికాకు చెందిన వెస్లీ సోను ఓడించి శుభారంభం చేసిన విషీ రెండో గేమ్‌లో చైనా ప్లేయర్ వీ యీతో గేమ్‌‌ను డ్రా చేసుకున్నాడు. మూడో రౌండ్‌‌లో ఇండియన్ అరవింద్ చిదంబరంపై అద్భుత విజయం సాధించాడు. హన్స్ నీమన్ ..  విదిత్ గుజరాతీతో డ్రా చేసుకుని, ప్రజ్ఞానందపై గెలిచాడు. గత నెల చివర్లో వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్‌‌  టోర్నీలో రెండు కాంస్యాలతో రికార్డు సృష్టించిన తెలంగాణ గ్రాండ్  మాస్టర్ ఎరిగైసి అర్జున్ తొలి రౌండ్‌‌లో విదిత్‌‌పై నెగ్గి.. తర్వాతి రెండు రౌండ్లలో ఓడి నిరాశపరిచాడు.