
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలోని ప్రజలు 2022 లో ఏకంగా 75 లక్షల కేసుల స్కాచ్ విస్కీ తాగేశారు. 2020 లో ఏడాది తాగిన 39 లక్షల కేసుల కంటే ఇది సుమారు రెండింతలు ఎక్కువ. స్కాచ్ విస్కీలో కూడా జానీ వాకర్, గ్లెన్ఫిడిచ్, దేవర్స్ వంటి ప్రీమియం సరుకు లేపేస్తున్నారు. 2020–22 మధ్య దేశంలో ఐరిష్ విస్కీ సేల్స్ ఐదు రెట్లు పెరగగా, జపనీస్ విస్కీ ఆరు రెట్లు, అమెరికన్ విస్కీ సేల్స్ మూడు రెట్లు పెరిగాయి. ఈ మూడు రకాల విస్కీల సేల్స్ 1.5 లక్షల కేసుల నుంచి 2022 లో 5 లక్షల కేసులకు ఎగిశాయి. కేవలం ఆల్కహాల్లోనే కాదు సబ్బులు, స్మార్ట్ఫోన్లు, ఎస్యూవీలు వంటి వివిధ కేటగిరీలలో ప్రీమియం (రేట్లు ఎక్కువగా ఉన్న) ప్రొడక్ట్ల కు డిమాండ్ కనిపిస్తోంది. హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) అమ్మే ప్రీమియం ప్రొడక్ట్లు డవ్, ట్రెసెమీ సేల్స్ ఊపందుకున్నాయి. తమ బిజినెస్లోని మూడో వంతు ప్రీమియం ప్రొడక్ట్ల నుంచే వస్తోందని, ఈ సెగ్మెంట్ వేగంగా విస్తరిస్తోందని హెచ్యూఎల్ ఎండీ రోహిత్ జావా అన్నారు. జానీ వాకర్ వంటి ఆల్కహాల్ బ్రాండ్లను అమ్మే డియాజియోకు ఇండియా మార్కెట్లో 80 శాతం సేల్స్ ప్రీమియం సెగ్మెంట్లోనే జరుగుతున్నాయి. గతంలో కేవలం 40 శాతం బిజినెస్ మాత్రమే జరిగేదని డియాజియో ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్వేతా జైన్ పేర్కొన్నారు. గొడవాన్, అల్వార్ వంటి ప్రీమియం ఆల్కహాల్ను మార్కెట్లోకి తెస్తున్నామని ఆమె చెప్పారు.
పెద్ద కార్లకు మొగ్గు..
ఆటో సెక్టార్లో పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతోంది. చిన్న కార్లతో మార్కెట్లో విస్తరించిన మారుతి సుజుకీ ఏడు సీటర్ల ఎంపీవీ ఇన్విక్టోను తాజాగా లాంచ్ చేసింది. దీని ధర రూ.25 లక్షలు. హీరో మోటార్ కార్ప్ ఎక్స్440 పేరుతో తమ మొదటి ప్రీమియం మోటార్ సైకిల్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ బండి ధర రూ.2.29 లక్షలు. బైక్ సెగ్మెంట్లో బజాజ్ ఆటో కూడా యూకే ట్రయంఫ్తో కలిసి 400 సీసీ బైక్ను రూ.2.3 లక్షలకు లాంచ్ చేసింది. ఈ ఏడాది మే నాటికి అమ్ముడైన మొత్తం కార్లలో 29.8 శాతం వాటా రూ. 7.5 లక్షలలోపు ఉంటే, రూ.17.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య రేటు ఉన్న కార్ల వాటా 15.2 శాతంగా ఉంది. 2018 లో ఈ నెంబర్ కేవలం 8.9 శాతం మాత్రమే. ఇంకొంచెం ఎక్కువ ఖర్చు చేస్తే మంచి ప్రొడక్ట్ వస్తుందని అనుకుంటే కస్టమర్లు వెనుకడుగు వేయడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. కంపెనీలు వీరి అవసరాలకు తగ్గట్టు ప్రొడక్ట్లను తెస్తున్నాయని వివరించారు. చాలా మంది కన్జూమర్లు పెద్ద కార్లు, ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న కార్లలో 50 శాతం పైగా సేల్స్ రూ.10 లక్షల పైనే ఉన్నాయి. హ్యుండాయ్ సేల్స్లో 50 శాతానికి పైగా, టాటా మోటార్స్ సేల్స్లో 65 శాతానికి పైగా రూ.10 లక్షల రేటుపైనే ఉన్నాయి. కన్జూమర్ల ప్రిఫరెన్స్ ఎస్యూవీ, ఎంపీవీల వైపు మరలుతోందని మారుతి సుజుకీ పేర్కొంది. కమొడిటీ ధరలు పెరగడం, రెగ్యులేషన్స్ కఠినం కావడంతో రూ.10 లక్షల కంటే తక్కువ విలువున్న కార్ల ధరలు పెరిగాయని వెల్లడించింది. ఇప్పటికి కూడా మారుతి సుజుకీ సేల్స్లో 50 శాతం చిన్న, కాంపాక్ట్ కార్ల వాటా ఉంది. ఈ నెంబర్ రానున్న కాలంలో తగ్గుతుందని ఎనలిస్టులు భావిస్తునారు.
హోటల్ సెక్టార్లోనూ..
లెమన్ ట్రీ ప్రీమియర్ తమ హోటల్స్ను 4 స్టార్ నుంచి 4.5 స్టార్కు అప్గ్రేడ్ చేస్తోంది. దేశంలోని మిడిల్ క్లాస్ ప్రజల ఆదాయాలు పెరిగాయని, వీరు ఖర్చు చేయడం కూడా ఎక్కువయ్యిందని ఈ హోటల్స్కు చెందిన పాటూ కేశ్వాని అన్నారు. రెనోవేషన్స్ తర్వాత తమ దగ్గర యావరేజ్ రూమ్ రెంట్ రూ.7 వేల నుంచి రూ.9 వేలకు చేరుకుందని వెల్లడించారు. బడ్జెట్ రూమ్స్ అందించే ఓయో కూడా ప్రీమియం రిసోర్ట్స్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్రా డేటా ప్రకారం, దేశంలోని ప్రీమియం హోటల్స్లో ఆక్యుపెన్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70–72 శాతం పెరుగుతుంది. యావరేజ్ రూమ్ రేట్ రూ.6 వేల కంటే ఎక్కువ ఉంటుంది. ఐటీసీ కూడా మరిన్నీ లగ్జరీ సర్వీస్లను తీసుకొచ్చే పనిలో ఉంది.
పెద్ద స్క్రీన్లకు ..
పెద్ద టీవీల సేల్స్ కూడా ఊపందు కుంటున్నాయి. ఈ ఏడాదిలోని మొదటి ఐదు నెలల్లో టీవీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగాయి. ఇందులో 65 ఇంచుల కంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న టీవీల సేల్స్ 37 శాతం పెరిగాయి. మొత్తం టీవీ సేల్స్లో వీటి వాటా 12 శాతంకు చేరింది. కరోనా ముందు ఈ నెంబర్ కేవలం 5 శాతం మాత్రమే. అదే విధంగా రూ.50 వేల కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ఫోన్ల సేల్స్ పెరిగాయి. ఈ సెగ్మెంట్ వాటా ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో 11 శాతానికి పెరిగింది. ఏడాది కిందట కేవలం 4 శాతం మాత్రమే ఉంది. ఐడీసీ డేటా ప్రకారం, 2018లో అమ్ముడైన సగటు స్మార్ట్ఫోన్ ధర రూ.12,375 ఉంటే 2022 లో ఇది రూ.16,950కి పెరిగింది. అమ్ముడైన ల్యాప్ టాప్లు, పీసీల సగటు ధర రూ.52,125 నుంచి రూ.59,280 కి పెరిగింది.