
బెంగళూరు: ప్లే ఆఫ్స్ బెర్త్కు చేరువగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. నాకౌట్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్కింగ్స్ ఐపీఎల్–18లో కీలక పోరుకు రెడీ అయ్యాయి. శనివారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచి ముందుకెళ్లాలని ఆర్సీబీ ప్లాన్స్ వేస్తుంటే.. విజయంతో ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని సీఎస్కే భావిస్తోంది. దీనికి మించి ఇద్దరు ఐకాన్ ప్లేయర్లు ధోనీ, కోహ్లీ మధ్య ఆఖరి సమరంగా ఈ మ్యాచ్ సాగనుంది. వచ్చే ఏడాది ఆడతాడో లేదో తెలియని డైలమాలో మహీ.. ఆర్సీబీకి తొలి టైటిల్ అందించాలనే లక్ష్యంతో కోహ్లీ ఉన్నాడు. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న బెంగళూరు ఇందులో నెగ్గితే మరో మూడు మ్యాచ్లు ఉండగానే ఇతర సమీకరణాలతో అవసరం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్కు వెళ్తుంది.
ఇక యంగ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ నింపేందుకు సీఎస్కేకు ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం. దీనివల్ల టేబుల్ చివరి ప్లేస్ నుంచి కాస్త పైకి వచ్చే అవకాశం ఉంది. గత ఐదు ఇన్నింగ్స్ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ 443 రన్స్తో ఆరెంజ్ క్యాప్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మరో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ను అందించడంతో పాటు హయ్యెస్ట్ రన్స్లోనూ ముందుండాలని కోరుకుంటున్నాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. లీగ్ ఆరంభంలో మెరుగ్గా ఆడిన కెప్టెన్ రజత్ పటీదార్ బ్యాట్ ఝుళిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత ఏడు మ్యాచ్ల్లో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ నూర్ అహ్మద్ను మినహాయిస్తే సీఎస్కే బౌలింగ్ యూనిట్ బలహీనంగా ఉంది. కాబట్టి దాన్ని రజత్ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక సీఎస్కే బ్యాటర్లు ఫామ్లేమితో ఇబ్బందిపడుతున్నారు. హేజిల్వుడ్, భువనేశ్వర్, క్రునాల్ పాండ్యా, సుయాష్ శర్మను ఎదుర్కోవడం వీళ్లకు కొద్దిగా కష్టమే. ఆయుష్ మాత్రే, సామ్ కరన్, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే నిలబడితే భారీ స్కోరును ఆశించొచ్చు. ఫినిషర్గా ధోనీకి ఇదే చివరి మ్యాచ్ కావొచ్చు. ఓవరాల్గా కోహ్లీ, ధోనీ తలపడే చివరి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ కూడా వీళ్ల నుంచి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ సిగ్నేచర్ ఇన్నింగ్స్ను ఆశిస్తున్నారు.