
న్యూఢిల్లీ: అమెరికా, -చైనా మధ్య తిరిగి మొదలైన టారిఫ్ ఉద్రిక్తతలు, భారతదేశ ద్రవ్యోల్బణ డేటా, అలాగే హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) రిజల్ట్స్ ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్ను నిర్ణయించనున్నాయి. యూఎస్–-చైనా ట్రేడ్ టెన్షన్ వల్ల వాల్ స్ట్రీట్లో శుక్రవారం భారీగా అమ్మకాలు జరిగాయి. నాస్డాక్ 3.56శాతం, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 2.71శాతం, డౌ జోన్స్ 1.90శాతం పడ్డాయి.
దీని ప్రభావం ఎమర్జింగ్ మార్కెట్లలో సోమవారం కనిపిస్తుంది. ఈ నెల 13న ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ), అక్టోబర్ 14న హోల్సేల్ ద్రవ్యోల్బణ (డబ్ల్యూపీఐ) డేటా విడుదల కానుంది. వీటిపై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాలి. ‘క్యూ2 ఫలితాలు, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, రిలయన్స్ కంపెనీల ఫలితాలు మార్కెట్ మూడ్ను ప్రభావితం చేస్తాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు.
ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పీచ్ ఈ నెల14న ఉంది. యూఎస్లో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఆయన సంకేతాలు ఇవ్వొచ్చు. కాగా, గత వారం సెన్సెక్స్ 1.59శాతం, నిఫ్టీ 1.57శాతం లాభపడ్డాయి.