దేశంలో 4 వేలు దాటిన కరోనా బాధితులు : ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ

దేశంలో 4 వేలు దాటిన కరోనా బాధితులు : ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ

దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. చల్లగా ఇళ్లల్లోకి వచ్చి తిష్టవేస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరింది. వంద, రెండు వందల నుంచి ఇప్పుడు ఏకంగా 4 వేలకు చేరటం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏంటనే ఆందోళన నెలకొంది జనంలో. ఢిల్లీలో ఒక్క రోజులోనే.. 47 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు 4 వేలకు చేరటంతో.. వైద్య శాఖ సైతం అలర్ట్ జారీ చేసింది.

భారతలో  జూన్ 2 ఉదయం నాటికి యాక్టివ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,961 గా ఉంది.  ఢిల్లీలో అత్యధికంగా 47 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య ,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఢిల్లీలో కోవిడ్  కారణంగా మరోకరు మృతి చెందారు.  మొత్తం మరణాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 483 కు పెరిగింది.

జూన్ 1న ఒక్క రోజే  పశ్చిమ బెంగాల్‌లో 82 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత కేరళలో 64 , ఢిల్లీలో 61 కేసులు నమోదయ్యాయి.  ఈ మూడు రాష్ట్రాల్లోని పరిస్థితులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కేరళలో 1435 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇదే అత్యధికం. తర్వాత మహారాష్ట్రలో 506 కేసులు, ఢిల్లీలో 483, గుజరాత్‌లో 338, పశ్చిమ బెంగాల్‌లో 287, ఉత్తరప్రదేశ్ 157, రాజస్థాన్ లో 60 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భారత్​ లో కొత్త సబ్ వేరియంట్​ NB.1.8.1 ను WHO  గుర్తించింది.ఈ వేరియంట్ ను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. వైరస్​ లక్షణాలు, పాత వేరియంట్లతో పోలిస్తే ప్రభావంపై అధ్యయనం చేస్తున్నారు.నమూనాలను కోవిడ్​ జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం INSACOG కి పంపించారు. గత రెండు వారాలుగా భారత్లో ఎక్కువగా BA.2, JN.1 వేరియంట్​ కేసులు నమోదు అవుతున్నట్లు గుర్తించారు

కరోనాకేసుల పెరుగుదలకు కారణాలివే.. 

ఏడాది క్రితం ఇచ్చిన వ్యాక్సిన్ల నిరోధక శక్తి తగ్గడం, ప్రజలు కోవిడ్​ రూల్స్​ పాటించకపోవడం, వేగంగా విస్తరించే కొత్త వేరియంట్​ NB.1.8.1 పుట్టుకురావడం వల్ల గత కొన్ని వారాలుగా దేశంలో కోవిడ్​ కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు, రిపోర్టులు చెబుతున్నాయి. వాతావరణంలో మార్పులు, గాలి నాణ్యతలో మార్పులు శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లను కూడా ప్రభావితం చేస్తాయి.