
ఆసియా కప్ సమరంలో టీమిండియా తొలి మ్యాచ్ కు సిద్ధమవుతోంది. ఆతిధ్య యూఏఈతో బుధవారం (సెప్టెంబర్ 10) జరగనున్న మ్యాచ్ లో భారీ విజయంపై కన్నేసింది. మరోవైపు యూఏఈ సంచలన ఫలితం కోసం ఎదురు చూస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. రికార్డులు, ప్లేయర్లు, ఆట పరంగా.. ఎలా చూసినా ఈ మ్యాచ్లో ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే 15 మంది స్క్వాడ్ లో తుది జట్టు ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..
అభిషేక్ శర్మతో పాటు శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. అభిషేక్ ఏడాదికాలంగా టీ20 క్రికెట్ భారత రెగ్యులర్ ఓపెనర్. గిల్ లాంటి స్పెషలిస్ట్ ఓపెనర్ ఉండడంతో శాంసన్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు దాదాపు లేవు. మూడో స్థానంలో తిలక్ వర్మ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఈ హైదరాబాదీ కుర్రాడు మూడో స్థానంలో తనను తాను నిరూపించుకున్నాడు. గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. సఫారీలతో జరిగిన 4 మ్యాచ్ల్లో టీ 20 సిరీస్ 198 స్ట్రైక్రేట్తో 280 పరుగులు చేశాడు.
నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. గత కొంతకాలంగా సూర్య విఫలమవుతున్నా.. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. ఐదో ప్లేస్లో వికెట్ కీపర్ కమ్ ఫినిషర్గా జితేష్ శర్మకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంజూ శాంసన్ నుంచి పోటీ ఉన్నా.. గంభీర్ మాత్రం జితేష్ వైపు మొగ్గుతున్నాడు. లోయర్ ఆర్డర్లో వేగంగా ఆడటంలో అతను దిట్ట. ఆరో స్థానంలో హార్థిక్ పాండ్య స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. ఏడో స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగడం ఖాయం. ఆల్ రౌండర్ దూబే, ఫినిషర్ రింకూ సింగ్ లో ఎవరికీ స్థానం దక్కుతుందో చూడాలి.
ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఖచ్చితంగా ఉంటారు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు నిరాశ తప్పేలా లేదు. బ్యాటింగ్ డెప్త్ కారణంగా కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టే వకాశాలు ఉన్నాయి. ఇటీవలే కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లో ఉంటాడు. కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):
అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ (వైస్ కెప్టెన్) , తిలక్ వర్మ , సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి , అర్షదీప్ సింగ్