సమాజ్ వాదీ పార్టీలోకి అత్యంత పొడుగైన వ్యక్తి

సమాజ్ వాదీ పార్టీలోకి అత్యంత పొడుగైన వ్యక్తి

యూపీలో ఎన్నికల సందడి నెలకొంది. జోరుగా రాజకీయ పార్టీల్లోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీలోకి భారత్ లోనే అత్యంత పొడువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ చేరారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ పటేల్ ఆధ్వర్యంలో, అఖిలేష్ యాదవ్ సమక్షంలో శనివారం ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నరహర్‌పూర్ కాసియాహి గ్రామానికి చెందిన ధర్మేంద్ర, 8 అడుగుల 2 అంగుళాల ఎత్తు. అతడు భారత్ లోనే అత్యంత పొడగరిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. అంతే కాదు ఆసియా ఖండంలోనూ అత్యంత పొడవైన వ్యక్తుల జాబితాలో ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఒకరు.

46 ఏళ్ల ధర్మేంద్ర ప్రతాప్ సింగ్..ప్రతాప్‌గఢ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తైనా.. ఆనాటి నుంచి ఉద్యోగం రాలేదు. తరచూ అనారోగ్యం కారణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నా చితకా పనులు చేస్తుండేవారు. ఈక్రమంలో అతనికి గుర్తింపు తెచ్చిన ఎత్తే.. శాపంగా మారింది. అసాధారణ ఎత్తు కారణంగా ధర్మేంద్రకు.. నడుం వంగేందుకు సహకరించేది కాదు. గతంలో నడుం కింది భాగంలో హిప్ జాయింట్ లో నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలనీ సూచించారు. 

దీంతో ఉద్యోగమే లేని ధర్మేంద్రకు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశాడు. తనకు సాయం చేయాలని ధర్మేంద్ర విన్నవించుకున్నాడు. దీంతో 2019లో వైద్యులు ధర్మేంద్రకు హిప్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం రాజకీయ నేతల ప్రచారంలో పాల్గొంటున్న ధర్మేంద్ర సమాజ్ వాదీ పార్టీలో చేరాడు.

ఇవి కూడా చదవండి: 

ఒమిక్రాన్ ఎఫెక్ట్ మూడ్రోజులే