
న్యూఢిల్లీ : సెప్టెంబర్2023 క్వార్టర్లో మన జీడీపీ 7.6 శాతం గ్రోత్ సాధించింది. మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, సర్వీస్ సెక్టార్లు దూసుకెళ్లడం వల్లే ఈ గ్రోత్ సాధ్యపడినట్లు ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. 2022 జులై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎకానమీ గ్రోత్ 6.2 శాతమే. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం అగ్రికల్చర్ సెక్టార్ జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) గ్రోత్ తాజా సెప్టెంబర్ క్వార్టర్లో 1.2 శాతం తగ్గిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో అగ్రికల్చర్ సెక్టార్ జీవీఏ గ్రోత్ 2.5 శాతం వద్ద నిలిచింది. ఈ నేపథ్యంలో వేగంగా ఎదుగుతున్న ఎకానమీ స్టేటస్ను ఇండియా నిలబెట్టుకుంది. ఎందుకంటే, జులై–సెప్టెంబర్ 2023 క్వార్టర్లో గ్రోత్ విషయంలో మనతో పోటీపడుతున్న చైనా 4.9 శాతం గ్రోత్ను మాత్రమే రికార్డు చేసింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్టార్ల జీవీఏ తాజా క్వార్టర్లో 6 శాతం గ్రోత్ నమోదు చేశాయి. కానీ, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో వీటి గ్రోత్ 7.1 శాతం. మైనింగ్, క్వారీయింగ్ అవుట్పుట్ (జీవీఏ) రెండో క్వార్టర్లో ఏకంగా 10 శాతం పెరగడం విశేషం. ఇక కన్స్ట్రక్షన్ సెక్టార్ 13.3 శాతం గ్రోత్ సాధించినట్లు డేటా చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.4 శాతం గ్రోత్ నమోదు చేస్తుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.