
- 5,364 ఇండ్ల బేస్మెంట్ పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఇప్పటికే 20 వేల ఇండ్ల పనులు స్టార్ట్ చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 5,364 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ పూర్తయిందని, వీరికి మొదటి దశ సాయం కింద రూ.53.64 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం హౌసింగ్ అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి ఆర్థికంగా నిధుల ఇబ్బందులు ఉన్నా ప్రతి సోమవారం బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి ఫండ్స్ జమ చేస్తున్నామని చెప్పారు.
బేస్మెంట్ పూర్తిచేసుకున్న 1,383 ఇండ్లకు, గోడలు పూర్తయిన 224 ఇండ్లకు సోమవారం రూ.16.07 కోట్లను విడుదల చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఇందులో 5,140 ఇండ్లు బేస్మెంట్, 300 ఇండ్లు గోడల నిర్మాణం, మరో వంద ఇండ్లు శ్లాబ్ల వరకు పూర్తయ్యాయని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
బేస్మెంట్ పూర్తయిన తర్వాత రూ.లక్ష, గోడలు పూర్తయ్యాక రూ.1.25 లక్షలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న ఇండ్లకు రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష విడుదల చేస్తామని వివరించారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.