హైదరాబాద్, వెలుగు : వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై శనివారం ప్రగతి భవన్ నుంచి సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ చేపట్టాల్సిన చర్యల గురించి సీఎం వివరించారు.
వరదలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రాచలంలో వరద పరిస్థితిపైనా ఆయన ఆరా తీశారు. అక్కడి ముంపు ప్రాంతాల నుంచి 12 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.