- ఎఫ్ఐఐల కదలికలపై ఫోకస్ పెట్టాలని ఎనలిస్టుల సలహా
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్ను ఇండియా హోల్సేల్ ద్రవ్యోల్బణ డేటా (సోమవారం), ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐల) ట్రేడింగ్, గ్లోబల్ సంకేతాలు ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు తెలిపారు. రూపాయి–డాలర్ కదలికలు, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఇన్వెస్టర్ల దృష్టిలో ఉంటాయి. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.17,955 కోట్లు (2 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన మొత్తం అవుట్ఫ్లో రూ.1.6 లక్షల కోట్ల (18.4 బిలియన్ డాలర్ల) కు చేరింది. రూపాయి బలహీనత, ఫండ్ అవుట్ఫ్లోలు ఇన్వెస్టర్ నమ్మకాన్ని దెబ్బతీశాయి. అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం (డిసెంబర్ 18న), రిటైల్ సేల్స్, పేరోల్స్ డేటా ఈ వారం విడుదల కానున్నాయి. మొత్తం మీద, మార్కెట్లు రేంజ్ బౌండ్లో ట్రేడవుతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. మధ్య మధ్యలో వోలటాలిటీ కనిపించొచ్చని అన్నారు. ఇండియా–యూఎస్ ఒప్పందం కుదిరితే గణనీయమైన పెరుగుదల సాధ్యమని అంచనా వేస్తున్నారు. కాగా, గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 444 పాయింట్లు (0.51శాతం) పడిపోయింది.
