- జగిత్యాలలో త్రిమెన్ కమిటీ విచారణ
- మీడియాను అనుమతించని ఆఫీసర్లు
జగిత్యాల/కొడిమ్యాల, వెలుగు: ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు వ్యవహారంపై కాంగ్రెస్అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోర్టును ఆశ్రయించగా సోమవారం ఈసీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు విచారణ జరిపారు. స్ట్రాంగ్ రూం ఓపెన్చేసి వివరాలు అందజేయాలన్న కోర్టు ఆదేశాలతో ఈ నెల10న కలెక్టర్యాస్మిన్ భాషా, ఇతర అధికారులు వెళ్లినా తాళాలు లేక తెరవలేకపోయారు. మళ్లీ అడ్లూరి లక్ష్మణ్ కూమర్ హై కోర్టుకు వెళ్లగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ఈనెల 26న తమకు నివేదిక అందజేయాలని ఈసీని ఆదేశించింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ముగ్గురు ఆఫీసర్లతో త్రిమెన్ కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ కోసం పంపించింది.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయిట్ సెక్రటరీ రవి కిరణ్ కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ఆఫీసర్గా ఉన్న అప్పటి కలెక్టర్శరత్, ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ గుగులోతు రవి, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషా, గతంలో అడిషనల్ కలెక్టర్లుగా పని చేసిన అరుణ శ్రీ, రాజేశం, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్భిక్షపతి ఎంక్వైరీకి హాజరయ్యారు. విచారణ జరుగుతున్న ప్రదేశానికి మీడియాను అనుమతించలేదు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్త్రిమెన్ కమిటీకి వినతిపత్రం ఇస్తామని చెప్పినా కలిసేందుకు పర్మిషన్ఇవ్వలేదు.