ముంబై: ఇండియన్ నేవీ చేతికి మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్డబ్ల్యూఎస్) అయిన ‘ఐఎన్ఎస్ మాహే’ను సోమవారం నేవీ ప్రారంభించింది. మహారాష్ట్రలోని ముంబై నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎన్ఎస్ మాహేను నేవీకి అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ మాహే ప్రారంభంతో స్వదేశీ టెక్నాలజీతో సంక్లిష్ట యుద్ధనౌకలను రూపొందించి, నిర్మించి, ఫీల్డ్ చేసే సామర్థ్యాన్ని దేశం మరోసారి నిరూపించిందని అన్నారు. ఈ కమిషనింగ్ ద్వారా సమీప సముద్రాల్లో ఇండియన్ నేవీ ఆధిపత్యం పటిష్టం కావడంతో పాటు తీరప్రాంత భద్రతా వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ఇది నౌకాదళాన్ని “బిల్డర్స్ నేవీ” గా మార్చేస్తుందని అన్నారు.
ఐఎన్ఎస్ మాహే విశేషాలివే..
- ఐఎన్ఎస్ మాహే ‘సైలెంట్ హంటర్’..80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు.
- ఇది వెస్ట్రన్ సీబోర్డు అధీనంలో పనిచేస్తుంది.
- మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం ‘మాహే’ పేరును ఈ నౌకకు పెట్టారు.
- ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చారు
- దీని పొడవు 77 మీటర్లు, బరువు 900 టన్నులు
- భూగర్భ ముప్పును కచ్చితంగా గుర్తించడానికి, ట్రాకింగ్, తటస్థీకరించడానికి వీలు కల్పిస్తుంది.
- ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలివరకు నిఘా వేసేందుకు వీలు లభిస్తుంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది.
