న్యూఢిల్లీ : ఇర్కాన్ ఇంటర్నేషనల్లో ప్రభుత్వం అమ్ముతున్న వాటాలను కొనేందుకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. 8 శాతం వాటాను అమ్మడానికి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఇష్యూను గవర్నమెంట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఇష్యూ శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఓపెన్ అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.
మొత్తం రూ.2,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు వీరు బిడ్స్ వేశారు. ప్రభుత్వం 7.53 కోట్ల ఇర్కాన్ షేర్లను అమ్మకానికి పెట్టింది. ఒక్కో షేరు రూ.154 కు అమ్ముతోంది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 3.38 కోట్ల షేర్లు అందుబాటులో ఉంచింది. 15.66 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. వీరికి ఒక్కో షేరును రూ.157.24 వద్ద ప్రభుత్వం అమ్ముతోంది. రైల్వే కంపెనీ ఇర్కాన్లో ప్రభుత్వానికి 73.18 శాతం వాటా ఉంది. కంపెనీ షేర్లు గురువారం 7 శాతం తగ్గి రూ. 160.75 దగ్గర క్లోజయ్యాయి.