
మెదక్: దుబ్బాకలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని మంత్రి వివేక్ అన్నారు. శుక్రవారం (జూన్ 20) సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని గుర్తు చేశారు.
మళ్లీ ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తోందన్నారు. ప్రజలందరూ ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వంటి ఎన్నో మంచి పనులు చేసిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని అన్నారు. రైతులందరికి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందిస్తున్నామని, సన్న వడ్లు పండించిన వారికి రూ.500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనే సదుద్దేశంతో రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు అన్ని స్కీములు అమలు చేస్తామన్నారు. త్వరలోనే రాజీవ్ యువ వికాసం పథకం కూడా ప్రారంభమవుతోందని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ప్రజలు, అధికారులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు.