
పది పాకిస్థాన్లో.. ఇంటర్ ఇండియాలో..
జోధ్పూర్: పౌరసత్వ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధం చేసిన తర్వాత కూడా పక్కదేశాల నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి రాజస్థాన్లో స్థిరపడిన ఓ హిందూ శరణార్థిని పరీక్షలకు అనుమతించని ఉదంతం రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది. దామి కోహ్లీ అనే యువతి కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చి జోధ్పూర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగన్వా శరణార్థి శిబిరంలో నివసిస్తున్నారు. అయితే కోహ్లీ 10వ తరగతి పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో చదివింది. ఆ తర్వాత రాజస్థాన్లోని ఓ కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరింది. అక్కడ ఇంటర్ ఫస్టియర్ కూడా పూర్తి చేసింది. ఇప్పడు సెకండియర్ పరీక్షలు రాసేందుకు దరఖాస్తును ఇంటర్ బోర్డుకు పంపింది. కానీ, రాజస్థాన్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కోహ్లీని పరీక్షలకు అనుమతించలేదు.
కోహ్లీని పరీక్షలకు అనుమతించాలంటే ప్రభుత్వం నిబంధనలను మార్చవలసి ఉంటుందని విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతసర అన్నారు. కోహ్లీ పాకిస్తాన్ బోర్డు నుండి పదవ తరగతి పూర్తి చేసిందని, కోహ్లీ సిలబస్కు సంబంధించిన వివరాలను కోరుతూ పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి ఒక లేఖ రాసినట్లు దోటసారా తెలిపారు. పాకిస్తాన్లో ఉన్న సిలబస్ను, రాజస్థాన్ సిలబస్ను పోల్చిచూస్తామని ఆయన అన్నారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి తమకు సానుకూల స్పందన వస్తే, ఖచ్చితంగా కోహ్లీని పరీక్షలకు అనుమతిస్తామని ఆయన తెలపారు. అంతేకాకుండా.. వారి నుండి ప్రతికూల స్పందన వస్తే.. బోర్డు నియమాలను మార్చి మరీ ఆమెను పరీక్షలకు అనుమతిస్తామని దోతసర అన్నారు.
తనను పరీక్షలకు అనుమతించకపోవడంపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘నేను 2018లో ఇంటర్లో చేరాను. నేను ఆ కాలేజీలో మొత్తం సంవత్సరం చదువుకొని ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత సాధించాను. నా దగ్గర మార్క్ షీట్ కూడా ఉంది. సెకండియర్ పరీక్షలకు ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో నాకు పరీక్షకు అనుమతిలేదంటూ కాలేజీ నుంచి నోటీసు వచ్చింది. నేను నాకు సబంధించిన అన్ని సర్టిఫికేట్లను అందజేశాను. నాకు చదువుకునే హక్కు కల్పించండి’ అంటూ వాపోయింది. డామి కోహ్లీ తండ్రి మాట్లాడుతూ.. పరీక్షలు రాయడానికి అనుమతిలేదంటూ తన కుమార్తెకు కాలేజీ నుంచి నోటీసు వచ్చిందని ఆమె తండ్రి అంటున్నారు.
మతపరమైన హింస కారణంగా కోహ్లీ తన కుటుంబంతో సింధ్ నుండి ఇండియాకు వలస వచ్చారని పాక్ శరణార్థుల తరపున పోరాడే సీమంత్ లోక్ సంగథన్ కన్వీనర్ హిందూ సింగ్ సోధా అన్నారు. ‘కోహ్లీ సింధ్లో తన 10వ తరగతిని పూర్తి చేసింది. ఆమెకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇంటర్ బోర్డుకు కావలసిన అన్ని సర్టిఫికేట్లను కోహ్లీ అందచేసింది. అయినా కూడా ఆమె దరఖాస్తును బోర్డు రిజెక్ట్ చేసిందని తెలిసి నేను షాకయ్యాను’అని హిందూ సింగ్ అన్నారు. పాక్ నుంచి వచ్చిన శరణార్థ విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో వారికి అనుకూలంగా ఓ సర్క్యులర్ జారీ చేసిందని ఆయన అన్నారు.