
25 నుంచి షెడ్యూల్ ఇచ్చిన బోర్డు
ఫలితాలు రాకుండానే రాసేదెలా?
సమీపిస్తున్న ఇతర పరీక్షలు, అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్స్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇప్పటికే రెండు సార్లు రిజల్ట్స్ డేట్లు మారుతూ వచ్చాయి. కోర్టు తీర్పుతో తాజాగా ఈ నెల 27కు వాయిదా పడ్డాయి. ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్తో పాటు మార్కులు, పరీక్ష పేపర్లను అన్నింటినీ ఒకేసారి ఆన్లైన్లో ఉంచితేనే స్టూడెంట్స్కు ఉపయోగకరమని హైకోర్టు సూచించడంతో ఇందుకోసం ఈ నెల 27 వరకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కోర్టు కూడా అప్పటివరకు సమయం ఇచ్చింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తామని బోర్డు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. అవి సమీపిస్తుండటం, ఇతర ఇంట్రెన్స్ టెస్టులు, కోర్సుల అడ్మిషన్లకు డేట్లు దగ్గర పడుతుండటం స్టూడెంట్లను కలవరపెడుతున్నది.
ఏప్రిల్ 18న వచ్చిన ఇంటర్ రిజల్ట్స్ లో అనేక తప్పులు దొర్లడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన బాటపట్టడం, ఫెయిలైన స్టూడెంట్స్కు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్ ఈ నెల 8న ప్రకటిస్తామని బోర్డు తొలుత ప్రకటించింది. తర్వాత15కు, తాజాగా 27కు వాయిదా పడింది. ఫెయిలైన స్టూడెంట్స్తో పాటు పాసైనా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కలిపి 3.82 లక్షల దాకా ఉంటారని అధికారులు చెప్తున్నారు. వీరందరి ఆన్సర్షీట్లును 27 కల్లా స్కాన్ చేసి వెబ్సైట్లో పెట్టడం సాధ్యమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ కోసం గ్లోబరీనాతో పాటు డేటా మెథడిక్స్ సంస్థను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రక్రియ సక్రమంగా జరక్కపోతే, రిజల్ట్స్ మళ్లీ వాయిదా పడే అవకాశమూ లేకపోలేదు.
‘అడ్వాన్స్డ్’ ను రీ షెడ్యూల్ చేస్తారా?
జేఈఈ, బిట్స్ ఎగ్జామ్స్ ఉండటంతో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 25కు బదులు 28 నుంచి ప్రారంభించేలా రీషెడ్యూల్ చేసే అవకాశముంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్లో పాసవుతామని ఆశతో ఉన్న స్టూడెంట్స్.. ఫలితాల ప్రకటన తేదీ మారడంతో ఆందోళనకు గురవుతున్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సమీపిస్తుండటంతో ప్రిపేరేషన్కు సమయం చాలదని టెన్షన్ పడుతున్నారు. మరో పక్క డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు కూడా సమయం సమీపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎంసెట్ రిజల్ట్స్ను ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్ తర్వాతే విడుదల చేస్తామని ఇప్పటికే ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. దీంతో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలూ ఆలస్యమయ్యే అవకాశముంది.