సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లిలోని గవర్నమెంట్ గల్స్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి చెందింది. జనవరి 8న కాలేజ్ ముగించుకొని సోదరితో పాటు మల్కాజిగిరి లోని ఇంటికి వెళ్లింది ఇంటర్ విద్యార్థిని వర్షిణి. ఇంటికి వెళ్ళాక తలనొప్పి వస్తుందని కింద పడిపోవడంతో వెంటనే ఆమెను మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. మెదడులో బ్లడ్ క్లాట్ అయి చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.
అయితే లెక్చరర్ల ఒత్తిడితోనే తమ కుమార్తె మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కాలేజీలో ఆందోళనకు దిగారు. కాలేజ్ కు లేట్ గా రావడంతో లెక్చరర్లు క్లాస్ లకు అనుమతించపోగా, దురుసుగా తిట్టడంతో మనస్తాపానికి గురై తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు. కాలేజ్ ఎదుట తల్లిదండ్రులు, దళిత నాయకులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులను కాలేజ్ బయటకు తీసుకెళ్లారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
