అనుమానాస్పద స్థితిలో ఇంటర్​ విద్యార్థి మృతి

అనుమానాస్పద స్థితిలో ఇంటర్​ విద్యార్థి మృతి

పద్మారావునగర్, వెలుగు: ఇంటర్​ స్టూడెంట్ మృతి మిస్టరీగా మారింది. చిక్కడపల్లి  పోలీసులు తెలిపిన ప్రకారం.. భధ్రాద్రి  జిల్లా మణుగూరుకు చెందిన ఎం. సుశాంక్​రెడ్డి(16) హైదరాబాద్ కు వచ్చి చిక్కడపల్లిలోని ఆకాశ్ ​జూనియర్ ​కాలేజీలో ఇంటర్​ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్టల్​లోని తన గదిలో ఉరేసుకోగా.. తోటి విద్యార్థులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చి చూడగా అప్పటికే అతడు చనిపోయాడు. కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బంధువులు శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకొని సుశాంక్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అతడి ఒంటిపై ఉరేసుకున్నట్టు ఎలాంటి గాయాలు, పాయిజన్​తీసుకున్నట్లు గుర్తులు కానీ కనిపించలేదని పేర్కొన్నారు. సుశాంక్​రెడ్డి మృతిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల పోలింగ్​సందర్భంగా కాలేజీకి మూడు రోజులు సెలవు ఇచ్చారని, సుశాంక్ మృతి  ఎవరికి చెప్పొద్దంటూ కాలేజీ మేనేజ్ మెంట్ తమపై ఒత్తిడి తెస్తుందని క్లాస్ మెంట్స్ గాంధీ ఆస్పత్రి వద్ద వాపోయారు. పోస్టుమార్టం అనంతరం డెడ్​బాడీని సొంతూరుకు తరలించారు. స్టూడెంట్ మృతిపై పోలీసులు నిష్పాక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను చెప్పాలని బంధువులు కోరుతున్నారు.