జులై 8 నుంచి ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్

జులై 8 నుంచి ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్

న్యూఢిల్లీ: జులై 8 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజులపాటు ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్​ జరగనుంది. 25 దేశాల నుంచి 5,000 మంది బయ్యర్లు ఇందులో భాగం పంచుకుంటారని అంచనా. గ్లోబల్​గా పేరొందిన ఇండస్ట్రీ ప్లేయర్లందరూ వస్తారని ఆశిస్తున్నట్లు టాయ్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సోమవారం వెల్లడించింది. వాల్​మార్ట్​, లెగో సహా 20 గ్లోబల్​ సోర్సింగ్​ కంపెనీల చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్లు టాయ్​ఫెయిర్​లో పాల్గొంటారని టాయ్​​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా పేర్కొంది. ఈ ఫెయిర్​లో మన దేశానికి చెందిన 250 కంటే ఎక్కువ బ్రాండ్లు తమ ప్రొడక్టులను ప్రదర్శనకు పెట్టనున్నాయని, ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో ఈ ఫెయిర్​ జరగనుందని తెలిపింది.

ఈ 14 వ టాయ్​ బిజ్​ ఇంటర్నేషనల్​ బీ2బీ ఎక్స్​పో 2023 సౌత్​ ఏషియాలోనే పెద్దదని టాయ్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా ఛైర్మన్​ మను గుప్తా చెప్పారు. తమ ప్రొడక్టులను, పనితనాన్ని గ్లోబల్​ కంపెనీలకు చూపించుకోవడానికి మన దేశంలోని టాయ్​ మాన్యుఫాక్చరర్లకు ఇదొక మంచి అవకాశమవుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కొత్త కస్టమర్లు, పార్ట్​నర్లను ఆకర్షించడం వారికి వీలవుతుందని చెబుతూ, మార్కెట్​ విస్తరణకు, బ్రాండ్​ రికగ్నిషన్​కు కూడా ఈ ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్​​ సాయపడుతుందని గుప్తా వివరించారు. అంతేకాదని, దేశంలోని టాయ్ మాన్యుఫాక్చరర్లందరూ ఒక చోట కలిసేందుకు ఈ టాయ్​ఫెయిర్​ అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఇలా కలవడం వల్ల దేశంలోని మాన్యుఫాక్చరర్లు ఒకరితో మరొకరు కలిసి ముందుకు వెళ్లే ఛాన్స్​ ఏర్పడుతుందన్నారు. కొలాబరేషన్స్​, పార్ట్​నర్షిప్స్​, జాయింట్ ​వెంచర్ల వంటి ప్రపోజల్స్​ కార్యరూపంలోకి తెచ్చుకోవడానికి ఇలాంటి ఫెయిర్స్​ ఉపయోగపడతాయని గుప్తా పేర్కొన్నారు.  

కొత్త బిజినెస్​ ఆపర్చునిటీస్​కు దారి.....

కొత్త బిజినెస్​ ఆపర్చునిటీస్​తోపాటు, ఇన్నొవేషన్స్​కు, కొత్త మార్కెట్లు వెతుక్కోవడానికి, డిస్ట్రిబ్యూషన్​ ఛానెల్స్​ ఏర్పాటుకూ ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్​ వేదిక అవుతుందని గుప్తా చెప్పారు. మన దేశంలోని టాయ్ ఇండస్ట్రీలో ఇన్నొవేషన్​ పెరగడానికి  టాయ్​ ఫెయిర్ ఒక ప్లాట్​ఫామ్ ​అని వివరించారు. టాయ్​ ఇండస్ట్రీలోని కొత్త ట్రెండ్స్, టెక్నాలజీలు, బెస్ట్​ ప్రాక్టీసులపై ఇండస్ట్రీ ఎక్స్​పర్టులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి ఇక్కడ వీలు కలుగుతుందని గుప్తా చెప్పారు. దేశంలోనూ, విదేశాలలోనూ మన టాయ్​ ఇండస్ట్రీ ఎంత ముఖ్యమైనదో దీని ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్​ టాయ్​ మార్కెట్​లో పెద్ద ప్లేయర్​గా మన దేశం మారడానికి ఇలాంటి ఫెయిర్స్​ దోహదపడతాయని లిటిల్​ జీనియస్​ టాయ్స్​ పేరుతో వుడెన్​  టాయ్స్​ తయారు చేసే కంపెనీ సీఈఓ నరేష్​ కుమార్​ గౌతమ్​ చెప్పారు. తాము ఈ ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్లో భాగం పంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని ఇతర  దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు, స్టేక్​ హోల్డర్ల సపోర్టు పొందడానికి ఇలాంటి ఫెయిర్స్​ఆవశ్యకమని వివరించారు.