4 రోజుల్లో రూ.12.26 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

4 రోజుల్లో రూ.12.26 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

ముంబై: ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ శుక్రవారం వరుసగా నాలుగో సెషన్‌‌‌‌లోనూ ర్యాలీ చేశాయి. బ్లూ-చిప్‌‌‌‌ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్,  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌లో కొనుగోళ్లు, ఎఫ్​ఐఐల తాజా పెట్టుబడులు ఇందుకు కారణం. యూఎస్​ డాలర్‌‌‌‌తో పోలిస్తే రూపాయి బలపడటం,  అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను పెంచాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 303.03 పాయింట్లు పెరిగి 84,000 స్థాయిని తిరిగి పొందింది. ఇది  84,058.90 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడేలో ఇది 333.48 పాయింట్లు ఎగిసి 84,089.35 వరకు వెళ్లింది. బీఎస్​ఈలో 2,251 షేర్లు లాభపడగా, 1,760 నష్టపోయాయి.  50-షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 88.80 పాయింట్లు పెరిగి 25,637.80 వద్ద ముగిసింది. ఈవారంలో బీఎస్ఈ సెన్సెక్స్‌‌ 1,650.73 పాయింట్లు లేదా 2 శాతం, నిఫ్టీ 525.4 పాయింట్లు లేదా 2 శాతం పెరిగింది. గత నాలుగు రోజుల్లో, బెంచ్‌‌‌‌మార్క్ 2,162.11 పాయింట్లు లేదా 2.64 శాతం పెరిగింది. దీంతో పెట్టుబడిదారుల సంపద రూ.12.26 లక్షల కోట్లు పెరిగింది.‘‘నిఫ్టీ,  సెన్సెక్స్ శుక్రవారం బాగా లాభపడ్డాయి. ఈ వారాన్ని బలమైన లాభాలతో ముగించాయి.

ఇజ్రాయెల్,- ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, యూఎస్​–ఇండియా వాణిజ్య ఒప్పందం చుట్టూ పెరుగుతున్న ఆశావాదం ఈ ర్యాలీకి మద్దతు ఇచ్చాయి. వారం ప్రాతిపదికన రెండు ఫ్రంట్‌‌‌‌లైన్ సూచీలు 2 శాతం పెరిగాయి" అని బజాజ్ బ్రోకింగ్ తెలిపింది. సెన్సెక్స్ ప్యాక్‌‌‌‌లో, ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనిలీవర్, భారత్ ఎలక్ట్రానిక్స్,  సన్ ఫార్మా లాభాలను ఆర్జించాయి.

ట్రెంట్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్,  టైటాన్ వెనకబడి ఉన్నాయి. జేఎస్​డబ్ల్యూ పెయింట్స్ లిమిటెడ్  మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అక్జో నోబెల్ ఇండియా షేర్లు 6.65 శాతం పెరిగి రూ.3,405 వద్ద ముగిశాయి.   మిడిల్​ఈస్ట్​లో కాల్పుల విరమణ, గడువుకు ముందే వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ఆశావాదం, ఎఫ్​ఐఐల కొనుగోళ్లు వంటివి పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను పెంచాయని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.

పెరిగిన స్మాల్​క్యాప్​, మిడ్​క్యాప్​
బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌ 0.54 శాతం, మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి. బీఎస్ఈ సెక్టోరల్​ సూచీలలో ఆయిల్‌‌ అండ్​ గ్యాస్ 1.21 శాతం, సేవలు 1.17 శాతం, విద్యుత్ 1.14 శాతం, వస్తువులు 1.11 శాతం, ఇంధనం 1.10 శాతం, యుటిలిటీస్ 0.99 శాతం,  టెలికమ్యూనికేషన్ 0.90 శాతం పెరిగాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) గురువారం రూ.12,594.38 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ లాభపడగా, దక్షిణ కొరియా కోస్పి, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్  మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌లో  ట్రేడయ్యాయి. గురువారం యూఎస్​ మార్కెట్లు  సానుకూలంగా ముగిశాయి.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.72 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌ ధర  68.20 డాలర్లకు చేరుకుంది. గురువారం, సెన్సెక్స్ 1,000.36 పాయింట్లు పెరిగి 83,755.87 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 304.25 పాయింట్లు 1.21 శాతం పెరిగి 25,549కి చేరుకుంది.