న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు మరింతగా పెరగడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు సోమవారం భారీగా క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,491 పాయింట్లు (2.74 శాతం) నష్టపోయి 52,843 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 382 పాయింట్లు (2.35 శాతం) తగ్గి 15,863 పాయింట్లు వద్ద ముగిసింది. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్లు రూ. 5.43 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 241.35 లక్షల కోట్లకు తగ్గింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 3,405 పాయింట్లు (6.05 శాతం) పతనమయ్యింది. రష్యా క్రూడాయిల్, గ్యాస్పై ఆంక్షలు పెడతారనే అంచనాలతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు సోమవారం 139 డాలర్లను టచ్ చేసింది. దీంతో పాటు డాలర్ మారకంలో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోతుండడంతో మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోందని ఈక్విటీ 99 ఎనలిస్ట్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. మళ్లీ పరిస్థితులు చక్కబడేంత వరకు కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దని సలహాయిచ్చారు. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం ఇప్పటిలో తగ్గేటట్టు కనిపించడం లేదని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. మార్కెట్లో వొలటాలిటీ ఎక్కువగానే ఉంటుందని అన్నారు. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలను జాగ్రత్తగా గమనించాలని సలహాయిచ్చారు. సెక్టార్ల పరంగా చూస్తే, సోమవారం సెషన్లో బీఎస్ఈ రియల్టీ, బ్యాంక్, ఫైనాన్స్, ఆటో ఇండెక్స్లు 5.31 శాతం వరకు నష్టపోయాయి. టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. హాంకాంగ్, షాంఘై, టోక్యో మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. యూరప్లోని మెజార్టీ మార్కెట్లు మధ్యాహ్నం సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ 6.08 శాతం లాభంతో 125 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 93 పైసలు తగ్గి 77.1 వద్ద సెటిలయ్యింది.
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు కదలలే!
సోమవారం మార్నింగ్ సెషన్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల రేట్లు కొంత టైమ్ వరకు అప్డేట్ కాలేదు. వీలున్నంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించామని ఎన్ఎస్ఈ ప్రకటించింది. అన్ని సెగ్మెంట్లలో ట్రేడింగ్ సాధారణంగానే కొనసాగుతోందని, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేట్లు కొంత టైమ్ వరకు బ్రాడ్క్రాస్ట్ కాలేదని పేర్కొంది.