ఈ సీజన్‌‌లో నటరాజన్ బౌలింగ్ అద్భుతం

ఈ సీజన్‌‌లో నటరాజన్ బౌలింగ్ అద్భుతం

అబుదాబి: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌ నుంచి సన్‌‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌‌-2 మ్యాచ్‌‌లో హైదరాబాద్ జట్టు పోరాడి ఓడింది. అయితే టోర్నీ ఆసాంతం తమ పెర్ఫామెన్స్‌‌తో ఫ్యాన్స్‌‌‌ను ఆకట్టుకుంది. డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్ ఎప్పటిలాగే టీమ్‌‌కు వెన్నెముకలా నిలిచారు. జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మనీష్ పాండే లాంటి ప్లేయర్లు మ్యాచ్ విన్నర్లుగా ఎదగడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. వీరందరినీ పక్కనబెడితే యంగ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ అందరి చూపును తన వైపునకు తిప్పుకున్నాడు.

అత్యంత కచ్చితత్వంతో యార్కర్లు విసురుతూ టాప్ బ్యాట్స్‌‌మెన్‌‌కు కూడా నటరాజన్ సవాల్ విసిరాడు. ఈ టోర్నీలో నటరాజన్ 160కి పైగా యార్కర్లు విసిరడం విశేషం. అతడి బౌలింగ్ గురించి ఎస్‌‌ఆర్‌‌హెచ్ కెప్టెన్ వార్నర్ స్పందించాడు. ‘ఈ టోర్నీలో మేం కనుగొన్న ప్లేయర్ నటరాజన్. అతడు అద్భుతంగా రాణించాడు. రషీద్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. నంబర్ 3 పొజిషన్‌‌లో మనీశ్ పాండే తన బ్యాటింగ్‌‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీ గ్రేట్ అనే చెప్పాలి. మా టీమ్‌‌కు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌‌కు థ్యాంక్స్’ అని వార్నర్ అన్నాడు.