ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపర్చింది

ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపర్చింది

న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌తో శనివారం జరిగిన మ్యాచ్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. సులువుగా నెగ్గాల్సిన మ్యాచ్‌‌లో ఓడిపోయి.. ప్లేఆఫ్ ఆశలను వదులుకుంది. 127 రన్స్ చిన్న టార్గెట్‌‌ను ఛేదించలేక రైజర్స్ బ్యాట్స్‌‌మెన్ చేతులెత్తేశారు. 24 బంతుల్లో 27 రన్స్ చేయాల్సిన దశలో మనీశ్ పాండే నెమ్మదిగా ఆడటం.. 14 పరుగుల తేడాలో చివరి 7 వికెట్లు కోల్పోవడం రైజర్స్ కొంపముంచింది. ఈ ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఛేజింగ్‌‌లో తమ జట్టులో ఆత్మ విశ్వాసం లోపించిందని వార్నర్ చెప్పాడు.

‘బ్యాటింగ్‌‌లో మాకు శుభారంభం దొరికింది. కానీ మేం నిరాశపర్చాం. మ్యాచ్‌‌ను సరిగ్గా ముగించలేకపోయాం. మా బ్యాటర్లలో ఇన్నింగ్స్ మధ్యలో ఆత్మ విశ్వాసం లోపించిడంతో గత మ్యాచ్‌‌లోలా ఫినిష్ చేయలేకపోయాం. మేం సులువుగానే రన్స్ చేయగలమని భావించాం. కానీ పరుగులు అంత ఈజీగా లభించలేదు. ఈ ఓటమి మమ్మల్ని బాధిస్తోంది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్‌‌ను నిలువరించారు. కానీ బ్యాటింగ్‌‌లో ఆ జోరును కొనసాగించలేకపోయాం. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి ముందుకెళ్లాలి’ అని వార్నర్ పేర్కొన్నాడు.